పరిగి: మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేకేఎంఎస్) నాయకులు డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా రైతుల సమస్యలు, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై స్థానిక షాదీ మహల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రంగనాయకులు మాట్లాడారు. గత ఖరీఫ్, రబీ సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు కనీసం పెట్టుబడులు కూడా రైతుల చేతికి అందలేదన్నారు. ఆదుకుంటామన్న ప్రభుత్వం రూ.2,500 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకుందని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా అన్నదాతలను నిట్టనిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. పెట్టుబడులు సైతం చేతికి అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారన్నారు. తక్షణమే మొక్కజొన్న పంటను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గిరీష్, మండల అధ్యక్షుడు సంజీవరాయప్ప తదితరులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గం ఎంపిక
అఖిల భారత రైతు వ్యవసాయ కూలీల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శంకరప్ప, ఉపాధ్యక్షుడిగా గోపాలరెడ్డి, కార్యదర్శిగా సంజీవరాయప్ప, సహాయ కార్యదర్శిగా వెంకటేష్, కోశాధికారిగా నంజేగౌడ, సభ్యులుగా శంకరప్ప, నరేష్, జయరామప్ప, వెంకటరమణప్ప, నరసింహప్పను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


