లాలేపల్లిలో మురుగు కాలువ
ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న గ్రామస్తుడు
చిలమత్తూరు: మండల పరిధిలోని లాలేపల్లిలో విషజ్వరాలు ప్రబలాయి. జ్వరం, దగ్గు, నొప్పులు వంటి లక్షణాలతో గ్రామస్తులు మంచం పట్టారు. ఆస్పత్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా జ్వరాలు మాత్రం తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పట్టించుకునే నాథుడే లేకపోవడంతో డ్రైనేజీల్లో మురుగు పేరుకుపోయింది. దోమల వ్యాప్తి ఎక్కువకావడంతో ప్రజలు జ్వరాలు బారిన పడుతున్నారని చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శితో పాటు సచివాలయ సిబ్బంది స్పందించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో సుమారు 30 నుంచి 40 మందికిపైగా జ్వరాల బారిన పడ్డారని చెబుతున్నారు. డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వేగంగా విస్తరించే అవకాశాలు ఉండటంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ప్రభుత్వాస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకుంటున్నారు.
కనిపించని వైద్య సిబ్బంది
అపరిశుభ్రత , కలుషిత నీరు ప్రభావంతో లాలేపల్లిలో జ్వరాలు ప్రబలినా పర్యవేక్షించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకూ జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్నా కనీసం ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కూడా చర్యలు చేపట్టలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పడకేసిన పారిశుధ్యం.. పెరిగిన దోమలు
ఇంటింటా జ్వర పీడితులు
పట్టించుకోని అధికారులు


