ప్రశాంతి నిలయం: పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సోమందేపల్లి తహసీల్దార్ గొల్ల మారుతీపై కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మారుతీని కలెక్టరేట్కు పిలిపించి విచారణ చేపట్టారు. మారుతీ పని చేసిన ప్రతి మండలంలోనూ భూసమస్యలతో ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఆయా మండలాల్లో మహిళలతో అక్రమ సంబంధాలు వంటి ఆరోపణలు రావడంతో జేసీ మౌర్య భరద్వాజ్, కలెక్టర్ శ్యాంప్రసాద్ విడివిడిగా విచారణ చేశారు. అలాగే సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగి వేణు అనే వ్యక్తి తహసీల్దార్ మారుతీ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని తన కాపురంలో చిచ్చుపెట్టారని వివరాలతో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మారుతీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, పూర్తి వివరాలతో సంజాయిషీ కోరినట్లు తెలిసింది.
చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతి
పెనుకొండ రూరల్: సోమందేల్లి తహసీల్దార్ మారుతీపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు ఆర్డీఓ ఆనంద్ కుమార్కు వినతిప్రతం అందజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తహసీల్దార్పై ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు. వెంటనే తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు హనుమయ్య, గోవిందప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యడు పెద్దన్న, నారాయణ, వెంకటరాముడు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.


