పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి మండల వ్యాప్తంగా మంగళవారం పలు గ్రామాల్లో వర్షం కురిసింది. సాయంత్రం ఉన్నఫలంగా ఆకాశం మేఘావృతమైంది. వెంటనే సుమారు అర గంట పాటు వర్షం కురిసింది. మండలంలోని మామిళ్లకుంట, ప్రశాంతి గ్రామం, కప్పలబండ, పెడపల్లి ,బత్తలపల్లి గ్రామాల్లో వాన పడింది. దీంతో ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. అయితే అకాల వర్షానికి మామిడి, మొక్కజొన్న, వేరుశనగ రైతుల్లో ఆందోళన మొదలైంది.
సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్
మడకశిర: మండలంలోని సీ కొడిగేపల్లి గ్రామ సచివాలయంలో పని చేస్తున్న ఎనర్జీ అసిస్టెంట్ రామాంజనేయులును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల ఆ గ్రామంలో ఓ బడా వ్యక్తికి నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ సామగ్రిని ఇచ్చారని తేలింది. దీంతో రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు వేసినట్లు విద్యుత్శాఖ డీఈ రఘు తెలిపారు. అలాగే విద్యుత్శాఖ ఏఈపై కూడా ఆరోపణలు రావడంతో ఆయనపై కూడా విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం.
రాత్రివేళ గస్తీ పెంచండి
రొద్దం: అసాంఘిక కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచి అడ్డుకట్ట వేయాలని ఎస్పీ సతీష్కుమార్ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ రాత్రి వేళ గస్తీ పెంచి నైట్ విజన్ డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సైబర్ నేరాలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పెనుకొండ డీఎస్పీ నరసింగప్ప, సీసీ చిరంజీవి, ఎస్ఐ వీరాంజినేయులు తదిరుతలున్నారు.


