కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని ఈశాన్యంలోఉన్న కోనేరును భవనాశినీ తీర్థం అని పిలుస్తారు. సంసార పరమైన కష్టాలను తొలగించే తీర్థంగా ఈ కోనేరు ప్రసిద్ధి చెందింది. ఈ తీర్థాన్ని భగవంతుడు ప్రసాదించిన ఒక అపూర్వమైన వరంగా భక్తులు భావిస్తుంటారు. ఒకప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్లు ఈ తీర్థంలో స్నానం చేసి పునీతులయ్యేవారు. అయితే దిగుడుబావి తరహాలో లోతుగా ఉండడంతో చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళా భక్తులు ఇందులోకి దిగి స్నానం చేయడం కష్టంగా మారింది. దీంతో కొన్నేళ్లుగా ఈ తీర్థంలో స్నానమాచరించేందుకు భక్తులను అనుమతించడం లేదు. కాగా, ఇందులో ఏర్పాటు చేసిన ఆంజనేయుడి విగ్రహం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆలయానికి అనుబంధంగా మొత్తం 13 తీర్థాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. భవనాశినీ తీర్థం, భృగుతీర్థం, గజేంద్ర తీర్థం, ఆళ్వారుల తీర్థం, అచ్యుత తీర్థం, అర్జున తీర్థం, శ్వేత పుష్కరిణి తీర్థం, గరుడ తీర్థం, నాగుల తీర్థం, కూర్మతీర్థం, స్వర్ణతీర్థం, శ్రీ తీర్థం, క్షీర తీర్థం (ప్రస్తుత పాలబావి)గా ఈ తీర్థాలు ఖ్యాతి గాంచాయి. 2022లో కురిసిన భారీ వర్షాలకు మద్దిలేరు తీరానికి సమీపంలో ఉన్న భృగు తీర్థం కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఈ కోనేరు పునర్మిర్మాణంలో ఉంది.


