మహిళా సాధికారతతోనే పురోభివృద్ధి
పుట్టపర్తి టౌన్: మహిళా సాధికారతతోనే సమాజం పురోభివృద్ధి చెందుతుందని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళల భద్రత,సాధికారతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కలె క్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురానా ముఖ్యఅతిథిలుగా హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ నుంచి గణేష్ కూడలి వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు జిల్లా కేంద్రం సైకిల్ ర్యాలీ నిర్వహించామన్నారు. సైకిల్ తొక్కడం వల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు. సైకిల్ వచ్చిన తరువాత ఎంతో మంది ఆడపిల్లలు స్వేచ్ఛగా పాఠశాలలకు వెళ్లి చదువుకుంటున్నారన్నారు. ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగాలంటే అందులో మహిళ పాత్ర ఎంతో కీలకమన్నారు.
మహిళల భద్రత అందరి బాధ్యత
సమాజంలో మహిళల భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. మహిళలను గౌరవిస్తే సమాజం మంచి భావాలతో మరింత ముందుకు వెళ్తుందన్నారు. ఒక తండ్రి తన కుమార్తెకు విద్యను అందిస్తే ఆ కుమార్తె కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందన్నారు. మహిళా భద్రతపై చైతన్యం కల్పించేలా వారం రోజుల పాటు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అడిషనల్ ఎస్పీ అంకిత సురానా మాట్లాడుతూ కుటుంబ స్థాయి నుంచి బాలికలకు సమాన హక్కు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఐసీడీఎస్ ప్రమీల, పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు సురేష్, శ్రీనివాసులు, బొజ్జప్ప, పోలీస్ శక్తి టీంలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఒక వ్యక్తి ఉన్నతిలో
మహిళ పాత్ర కీలకం
కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్


