లక్ష్మీనృసింహా నమోనమః
రొళ్ల: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేది నుంచి 8వ తేది వరకూ జరగనున్నాయి. ఇందు కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ఏటా ఫాల్గుణ శుద్ధ త్రయోదశి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది.
ఉత్సవాలు ఇలా...
1న అంకురార్పణ, 2న కలశ స్థాపన, శ్రీవారి కల్యాణోత్సవం, యోగీశ్వరాధన, 3న ఉదయం 9.30 గంటలకు బ్రహ్మరథోత్సవం, 4న వసంతోత్సవం, మీసలు (సేకరణ) కలియుట, రొళ్ల కొండపై దివ్య జ్యోతి దర్శనం, 5న గరుడోత్సవం, 6న పూల పల్లకీ ఉత్సవం, 7న దేవతా సంకీర్తన, 8న భూతప్ప సేవలు, తలనీలాలు సమర్పణ, 9న 101 ప్రసాద వినియోగం, భక్తుల ముడుపుల ఉత్సవం, 10న మహామంగళారతి, ప్రసాద వినియోగం కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల్లో భాగంగా 3, 8వ తేదీల్లో దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఉంటుంది.
భూతప్పల కాలిస్పర్శకు
తరలివచ్చే భక్త జనం..
రొళ్ల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8న జరిగే భూతప్ప సేవలు చాలా విశేషంగా ఉంటాయి. భూతప్ప స్వామి కాలిస్పర్శతో తమ కస్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా కర్ణాటక నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సంతాన భాగ్యం లేనివారు, దీర్ఘ రోగాలతో సతమవుతున్న వారు, పెళ్లిళ్లు కావాలనుకునే కోరుకునే యువతులు, ఇతర సమస్యలు ఉన్న వారు చన్నీటి స్నానం ఆచరించి తడి దుస్తులతో రత్నగిరి రోడ్డులో వెలసిన ఈర ముద్దమ్మదేవి ఆలయం నుంచి లక్ష్మీనృసింహ స్వామి ఆలయ ప్రాంగణం వరకూ బోర్ల పడుకుని భూతప్పల రాక కోసం వేచి చూస్తారు.
ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన రొళ్లలోని లక్ష్మీనృసింహ స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శనివారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణి రంజిత పుణ్యమూర్తే యోగీశశాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్’ అంటూ ఒక్కసారి ఇక్కడి స్వామిని స్తుతిస్తే చాలు భయాలు, చింతలు దూరమవుతాయని భక్తుల నమ్మకం.
కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా ఖ్యాతి
రేపటి నుంచి రొళ్ల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
8న ఆకర్షణీయంగా భూతప్ప సేవలు
600 ఏళ్ల చరిత్ర
రొళ్లలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 600 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఇక్కడి స్వామి వారిని కొలిస్తే ఎలాంటి ఈతిబాధలైనా దూరమవుతాయని భక్తుల నమ్మకం. ఏటా ఫాల్గుణ మాసంలో వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. – వెంకటేష్, ప్రధాన అర్చకుడు
సుదూర ప్రాంతం నుంచి వస్తుంటాం
ఇక్కడి స్వామిని దర్శించుకున్న తర్వాత మా కష్టాలు దూరమయ్యాయి. అప్పటి నుంచి మా ఇంటి ఇలవేల్పుగా కొలుస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు తప్పని సరిగా కుటుంబం సమేతంగా హాజరవుతాం. భూతప్పల కాలి స్పర్శ కోసం కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంటాం.
– యామిని, భద్రాపుర, సికారిపుర తాలూకా, శివమొగ్గ జిల్లా, కర్ణాటక
లక్ష్మీనృసింహా నమోనమః
లక్ష్మీనృసింహా నమోనమః
లక్ష్మీనృసింహా నమోనమః


