9 నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
ప్రశాంతి నిలయం: ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అగ్నివీర్ పోస్టుల భర్తీకి మార్చి 9 నుంచి గుంటూరులో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మార్చి 9న మహిళా అభ్యర్థులకు, మార్చి 12న పురుష అభ్యర్థులకు ర్యాలీ ఉంటుందన్నారు. 2.07.2005 – 02.01.2009 మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులని, అభ్యర్థులు కనీసం 152 సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉండాలన్నారు. అలాగే ఇంటర్, డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మొత్తం మార్కుల్లో 50 శాతం, ఇంగ్లిష్లో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలన్నారు. విద్యార్హత, ఎన్సీసీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు ఒరిజినల్తో పాటు ఆరు సెట్ల జిరాక్సులు తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాగే మొబైల్ నంబర్, పాస్ పోర్టు సైజు ఫొటోలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అర్హులైన జిల్లా యువత రిక్రూట్మెంట్ ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
బాధితులకు
న్యాయం చేయండి
పుట్టపర్తి టౌన్: ఎంతో నమ్మకంతో పోలీసు స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలు విని న్యాయం చేయాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన కొత్త చెరువు అప్గ్రేడ్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసులు పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రాత్రి వేళల్లో గస్తీలు ముమ్మరం చేయాలని, మట్కా, పేకాట గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో సీఐ మారుతీశంకర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఆత్మహత్య చేసుకుంటానంటూ
వ్యక్తి హల్చల్
రొద్దం: మండల కేంద్రానికి చెందిన గోపాలమిత్ర రాజు తనను భార్య వేధిస్తోందని, ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోల్ క్యాన్ చేతిలో పెట్టుకుని గురువారం హల్చల్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రాజును అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. కాగా, ఆరేళ్లుగా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఈ క్రమంలో విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లుగా పోలీసులు తెలిపారు.
ప్రతి లే అవుట్
క్రమబద్ధీకరణకు చర్యలు
● ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు
త్వరితగతిన పరిష్కరించాలి
● అహుడా వైస్ చైర్మన్
విష్ణుచరణ్ ఆదేశం
అనంతపురం క్రైం: అహుడా పరిధిలోని ప్రతి లే అవుట్నూ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) వైస్ చైర్మన్ సి. విష్ణుచరణ్ ఆదేశించారు. లే అవుట్ల క్రమబద్ధీకరణ అంశంపై గురువారం అనంతపురంలోని అహుడా కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. అహుడా చైర్మన్ టి.సి. వరుణ్, సెక్రటరీ జి. రామకృష్ణారెడ్డి పాల్లొన్నారు. ఈ సందర్భంగా విష్ణుచరణ్ మాట్లాడుతూ.. ఎంఐజీ లే అవుట్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రతి ఫ్లాట్ కొనుగోలుదారునికి మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ పథకం (ఎల్ఆర్ఎస్–2020) కింద క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కారించాలన్నారు. అక్రమంగా లే అవుట్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎంఐజీ పేమెంట్లు, రిజిస్ట్రేషన్ల అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అహుడా పీఓ ఇషాక్, ఇంజనీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జెపీఓ హరీష్ చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
9 నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ
9 నుంచి అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ


