వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
జిల్లాలో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
పాలయ్యారు. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి చక్రాల కిందపడి ఒకరు మృతి చెందగా... లారీని వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో మరో ద్విచక్రవాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు.
రాయదుర్గం టౌన్: మండలంలోని టి.వీరాపురం గ్రామానికి చెందిన ఈశ్వరప్ప (55) వ్యక్తిగత పనిపై గురువారం రాయదుర్గానికి వచ్చాడు. పని ముగించుకుని సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన టి.వీరాపురం సమీపంలో మలుపు వద్ద ఎదురుగా వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓవరటేక్ చేసే క్రమంలో అదుపు తప్పి బస్సు వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య వడ్రక్క, ఓ కుమారుడు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయంతో పాటు జీవాల పోషణతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జయానాయక్ తెలిపారు.
తాడిపత్రి రూరల్: నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురం గ్రామానికి చెందిన మద్దిలేటి తన ఇద్దరు కుమారులకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తన అన్న కుమారుడు బండి చరణ్ (18)తో కలసి ద్విచక్ర వాహనంపై గురువారం సాయంత్రం తాడిపత్రిలోని ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు బయలుదేరాడు. తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న సిమెంట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వెనుకనే ఉన్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఘటనలో బైక్ నడుపుతున్న బండి చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మద్దిలేటికి తీవ్ర గాయాలయ్యాయి. మద్దిలేటి కుమారులు అర్జున్, సురేష్ సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు.
సచివాలయ సిబ్బందికి మెమోలు
గాండ్లపెంట: మండలంలోని సోమయాజులపల్లి గ్రామ సచివాలయ సిబ్బందికి ఎంపీడీఓ టి.రామకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గురువారం డిప్యూటీ ఎంపీడీఓ పద్మనాభరెడ్డితో కలసి తనిఖీలకు వెళ్లిన సమయంలో అక్కడ ఉండాల్సిన పది మంది ఉద్యోగులకు గాను కేవలం ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఒక్కరే ఉన్నారు. హాజరు పట్టీలో సంతకాలు కూడా లేవు. దీంతో గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పాముకాటుతో వివాహిత మృతి
పరిగి: మండలంలోని గొరవనహళ్లికి చెందిన వివాహిత శీగిపల్లి కొల్లమ్మ(46) పాముకాటుతో మృతి చెందింది. ఆమెకు భర్త నరసింహప్ప, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు పైళ్లెంది. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. బుధవారం ముల్లమోతుకపల్లి వద్ద మొక్కజొన్న తూర్పారబెట్టడానికి పనికి వెళ్లిన ఆమె సాయంత్రం పాము కాటుకు గురైంది. విషయం తెలుసుకున్న కూలీలు వెంటనే ఆమెను హిందూపురంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురానికి తీసుకెళుతుండగా రాప్తాడు మండలం మరూరు టోల్ప్లాజా వద్దకు చేరుకోగానే మృతి చెందింది. ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
రాయదుర్గం టౌన్: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటనతో జీవనం సాగిస్తున్న వృద్ధుడు (70) గురువారం ఉదయం మృతిచెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా పాత రైల్వేస్టేషన్ భవనం వద్ద ఉండేవాడు. ఈ క్రమంలో కనీస చికిత్సకు సైతం నోచుకోక ఇబ్బంది పడుతున్నట్లుగా గుర్తించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం


