
సొసైటీలను తనిఖీ చేసిన కలెక్టర్
పుట్టపర్తి అర్బన్: యూరియా కొరత అధికం కావడంతో కలెక్టర్ చేతన్ పలు మండలాల్లోని సొసైటీలను తనిఖీ చేశారు. బుక్కపట్నం మండలం గూనిపల్లి, కొత్తచెరువు మండలం కేశాపురం, సోమందేపల్లి లోని సొసైటీలను తనిఖీ చేసి యూరియా స్టాక్పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరి సాగుకు అధిక నీటితో పాటు యూరియా అవసరం ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటితో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. చిరుధాన్యాల సాగు, పండ్ల తోటలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను, సేంద్రియ ఎరువులను వినియోగించడంలో ముందుండాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చే వివిధ ప్రయోజనాలను ,సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీఓ ఆనంద్, డీసీఓ కృష్ణానాయక్, ఏఓ నటరాజ్, తహసీల్దార్ నరసింహులు, సీఈఓ ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులకు నేడు అవార్డుల ప్రదానం
పుట్టపర్తి అర్బన్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విద్యాబోధనలో ప్రతిభ కనబరచడంతో పాటు పాఠశాలను అభివృద్ధి చేసి సమసమాజస్థాపనకు కృషి చేసిన జిల్లాలోని 71 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేయనున్నారు. పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని మంగళకర ఎడ్యుకేషన్ ట్రస్ట్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొననున్నారు.
ఏడుగురికి
ఎంపీడీఓలుగా పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడుగురికి ఎంపీడీఓలుగా పదోన్నతి దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేస్తున్న 156 మందికి ఎంపీడీఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మొత్తం ఏడుగురు ఉన్నారు. ఏఓలు ఉమాదేవి (జెడ్పీ–అనంతపురం), జి.శ్రీనివాసులు (బత్తలపల్లి), జయరాములు(వజ్రకరూరు) ఎంపీడీఓగా పదోన్నతి పొందారు. డిప్యూటీ ఎంపీడీఓ క్యాడర్ నుంచి శకుంతల (నల్లచెరువు), మాధవి(డీపీఆర్సీ–అనంతపురం), ఆనంద్(రాప్తాడు), కమలాబాయ్(పెనుకొండ) ఉన్నారు.
8 నుంచి శిక్షణ తరగతులు..
ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన వారికి ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శివశంకర్ గురువారం రాత్రి తెలిపారు. ఈ మేరకు వారందరికీ సమాచారం ఇచ్చామని వివరించారు.
ఏడు రోజుల పోలీసు
కస్టడీకి నిందితులు
కదిరి అర్బన్: మండలంలోని కొండమనాయునిపాళెం సమీపంలో గత నెల 22న గంజాయిని అక్రమ తరలిస్తూ పట్టుబడిన అజాజ్, షోయబ్ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందని, నిందితులను పోలీస్ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటీషన్పై అనంతపురం ఎన్డీపీఎస్ కోర్టు జడ్జి స్పందిస్తూ ఏడు రోజుల కస్టడీకి అనుమతించారు. ఈ మేరకు కదిరి రూరల్ అప్గ్రేడ్ పీఎస్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు.
రిమాండ్కు నిందితులు..: కదిరి మండలం పట్నం గ్రామంలో ఈ నెల 1న జరిగిన హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న సూర్యనారాయణ, అతని కుమారులు అరవిందు, నవీన్అశోక్, భార్య రమణమ్మ, కుమార్తె కీర్తనను అరెస్ట్ చేసినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి కొడవలి, ఇనుపరాడ్ స్వాధీనం చేసుకుని న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు వివరించారు.