
తాగుడు మానేయాలంటూ భర్తపై దాడి
ఉరవకొండ రూరల్: పదేపదే ప్రాధేయపడిన తాగుడు మానేయకపోవడంతో అసహనానికి లోనైన వివాహిత తన భర్తపై కట్టెతో దాడి చేసింది. వివరాలు.. ఉరవకొండ మండలం చిన్నముష్టూరు గ్రామానికి చెందిన ఓబులేసు, ఉలిగమ్మ దంపతులు. కూలి పనులతో జీవనం సాగించేవారు. ఈ క్రమంలో భర్త తాగుడుకు బానిసై కూలి పనులు చేయకుండా నిత్యమూ మద్యం మత్తులో జోగేవాడు. తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తరచూ భార్యతో గొడవ పడేవాడు. తాగుడు మానాలని భార్య పలుమార్లు ప్రాధేయపడింది. అయినా ఓబులేసులో మార్పు రాలేదు. గురువారం ఉదయం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న ఓబులేసును మరోసారి భార్య మందలించింది. తాగుడు మానేసి బుద్ధిగా తనతో పాటు కూలి పనులకు రావాలని హితవు పలికింది. ఆమె మాటలతో ఏకీభవించని ఓబులేసు వాగ్వాదానికి దిగాడు. దీంతో అసహనానికి గురైన ఉలిగమ్మ చేతికి అందుబాటులో ఉన్న కట్టె తీసుకుని భర్తపై దాడి చేసింది. అనంతరం స్థానికులతో కలసి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు అనంతపురానికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.