● జెండా ఊపి ప్రారంభించిన
కలెక్టర్ బసంత్కుమార్
పుట్టపర్తి అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం జిల్లాకు 104 సంచార వాహనాలు కేటాయించింది. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ బసంత్కుమార్ డీఎంహెచ్ఓ ఎస్వీ కృష్ణారెడ్డితో కలిసి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు నాలుగు వాహనాలు రాగా మూడింటిని మడకశిర, గోరంట్ల, ముదిగుబ్బ మండలాలకు కేటాయించామన్నారు. మరో వాహనం జిల్లా కేంద్రంలో అదనంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో 104 జిల్లా నోడల్ ఆఫీసర్ సెల్వియా, జిల్లా మేనేజర్ శంకర్, వైద్యాధికారి నాగరాజు నాయక్, ఎగ్జిక్యూటివ్లు కృష్ణ, ఆదినారాయణ, జుబీర్ తదితరులు ఉన్నారు.
ఫార్మా–డీ ఫస్టియర్
సప్లి ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన ఫార్మా–డీ మొదటి సంవత్సరం (ఆర్–17) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఇ.కేశవరెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాల కోసం జేఎన్టీయూ అనంతపురం వెబ్సైట్ను సందర్శించవచ్చన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ప్రశాంతి నిలయం: ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సోమవారం 99 కేంద్రాల్లో జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 787 మంది గైర్హాజర్ అయ్యారు. ఇందులో జనరల్కు సంబంధించి ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 28,833 మందికి గాను 28స151 మంది హాజరయ్యారు. 682 మంది గైర్హాజరయ్యారు. ఇక ఒకేషనల్ విద్యార్థులు 2,602 మందికి గాను 2,497 మంది హాజరుకాగా, 105 మంది గైర్హాజరయ్యారు.
ఆ ప్రశ్నకు రెండు మార్కులు
ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు సోమవారం జరిగిన ఫిజిక్స్ పరీక్షకు సంబంధించి మూడో ప్రశ్న గందరగోళంగా ఉండడంతో సమాధానం రాసినా, రాయకపోయినా రెండు మార్కులు కలపనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించిందని ఆర్ఐఓ సురేష్బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
మెడికల్ కళాశాల స్నాతకోత్సవం రేపు
అనంతపురం సప్తగిరి సర్కిల్: ప్రభుత్వ వైద్య కళాశాలలో బుధవారం సాయంత్రం స్నాతకోత్సవం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ నాగలక్ష్మి, లోక్సతా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, నంద్యాల డిప్యూటీ కలెక్టర్ భరత్నాయక్, ఇన్కం ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి, ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన తదితరులు హాజరుకానున్నారు. 2017 బ్యాచ్కు చెందిన విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు.