● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
నెల్లూరు రూరల్: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటాలు, ప్రజాధన వృథాను వెంటనే నిలిపివేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరు ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానాశ్రయం ప్రారంభానికి రూ.30 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఓవైపు పొదుపు మంత్రం చెబుతూ, మరోవైపు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చినప్పుడు కేవలం రూ.లక్షతో, 500 మందితో సాదాసీదాగా సభ నిర్వహించామని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చి అమిత్ షా రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నెల్లూరు కలెక్టర్ ముత్తుకూరు ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పర్యావరణ సమస్యలను పరిశీలించాలని కోరారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చందనమూడి శివ, ఎస్వీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


