నెల్లూరు రూరల్: జిల్లాలో 2047 నాటికి 50 శాతం హరితవరణాన్ని సాధించడమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమష్టిగా కృషి చేసి హరిత కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. హరిత కార్యక్రమాల అమలుపై కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లా అటవీ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన, వ్యవసాయ, పంచాయతీరాజ్, విద్య, పరిశ్రమలు, నీటిపారుదల శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తదితర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీటిని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. తమ పరిధిలోని రహదారులు, కాలువలు, చెరువులు, ప్రభుత్వ ఖాళీ భూములు తదితరాల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, నమోవనాల స్థలాల ఏర్పాటుకు అనుకూల భూములను పరిశీలించి వివరాలను జిల్లా అటవీ శాఖకు త్వరితగతిన అందజేయాలని ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి మహబూబ్బాషా, సోషల్ ఫారెస్ట్రీ జిల్లా అటవీ అధికారి నాగార్జునరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వసుమతి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.


