● మ్యాపింగ్ కాని ఓటర్లకు మరో అవకాశం
● 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(అర్బన్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్లకు సంబంధించి చేపట్టిన సర్ ప్రక్రియ 100 శాతం విజయవంతం అయిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం సర్ ప్రక్రియపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 15 నుంచి ఈ నెల 24 వరకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించడానికి అధికారులు, సచివాలయ సిబ్బంది, బీఎల్వో లు అహర్నిశలు శ్రమించారన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జిల్లాలో గతంలో 19,74,240 మంది ఓటర్లు ఉండగా, 16,83,557 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించి 85.28శాతం మ్యాపింగ్ పూర్తి చేశామన్నారు. వారిని 2002 ఓటర్ల జాబితాలోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా అనుసంధానం చేశామన్నారు. మ్యాపింగ్ కాని 1.8 శాతం ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదోకటి ఈఆర్ఓకు సమర్పిస్తే వారి ఓటు హక్కు కొనసాగుతుందన్నారు. వారికి ఇంకో అవకాశం కల్పించామన్నారు. 38,645 డూప్లికేట్ ఓట్లను తొలగించడం జరిగిందన్నారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన 1,13,421 మంది ఓటర్లు, మృతి చెందిన 80,699 మంది ఓట్లను పక్కన పెట్టేశామన్నా రు. 57,077 మంది ఓటర్లు అందుబాటులో లేని వారిగా గుర్తించామన్నారు. ఈ నెల 31న ఓటర్ల ముసాయిదా జాబితా(డ్రాప్ట్)ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురిస్తామన్నారు. అనంతరం 30 రోజల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అర్హులైన వారి పేర్లు లేకపోతే ఈఆర్వోలను సంప్రదించి ఓటు వివరాలను సవరించుకోవచ్చని తెలిపా రు. కాగా అధికారులతో కలిసి సర్ ప్రక్రియ నిర్వహించిన వారిపై ఏమి చర్యలు తీసుకున్నారని విలేకరులు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ను ఉద్దేశించి ప్రశ్నించగా ఈ విషయమై ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. సీఈఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. చట్టపరంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. ఈ సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.


