దగదర్తి: మండలంలోని కొత్తపల్లి కౌరుగుంటలో ఏపీఐఐసీ భూమిలో హద్దులను స్పష్టంగా నిర్ణయించకపోవడంతో ఈ ప్రాంతంలో వివాదాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి గ్రామంలోని సర్వే నంబర్ 279లో సుమారు ఏడెకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీ సేకరించింది. ఈ భూమికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 309, 279లో సుమారు ఆరెకరాల మేర శ్మశాన భూమి 50 ఏళ్లుగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో సర్వే నంబర్ 279లో ఎకరాను చిన్న పరిశ్రమ కోసం ప్రైవేట్ వ్యక్తి కొనుగోలు చేశారు. భూమిని చదును చేసే సమయంలో శ్మశానంగా వినియోగిస్తున్న ప్రాంతంలో సైతం జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై గతంలో వివాదాలు చోటుచేసుకోగా, కలెక్టర్కు వినతిపత్రాన్ని గ్రామస్తులు అందజేశారు.
హామీ విస్మరణ
భూములను ఏపీఐఐసీ సేకరించే సమయంలోనే అక్కడ శ్మశానం ఉందని అధికారులు గుర్తించారు. దీన్ని గ్రామస్తులకే అప్పగిస్తామని, భూసేకరణ చేయబోమని ఆ శాఖతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు హామీ ఇచ్చారు. అయితే దీన్ని నేటికీ నెరవేర్చలేని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా శ్మశాన భూమికి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసి, అధికారిక రికార్డుల్లో నమోదు చేసి తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


