బుచ్చిరెడ్డిపాళెం: పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నుంచి ఆత్మకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ అతడి తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ శివరామకష్ణారెడ్డి తెలిపారు. మృతుడిని ఆత్మకూరు జేఆర్ పేటకు చెందిన అశోక్కుమార్ (35)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అశోక్ హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నాడు. కానీ ప్రమాదం వల్ల అది పూర్తిగా నలిగిపోయింది.
జేఆర్పేటలో విషాదం
ఆత్మకూరు: కంభంశెట్టి అశోక్కుమార్ మృతితో జేఆర్పేటలో విషాదం నెలకొంది. అతను ఆత్మకూరులోని ఎస్ఎస్వీ కళాశాల కరస్పాండెంట్గా వ్య వహరిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అశోక్ అందరితో కలివిడిగా ఉంటూ విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేవాడు. అతని మృతితో విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు.
వ్యక్తి బలవన్మరణం
కొండాపురం: మండలంలోని గొట్టిగుండాల ఎస్టీ కాలనీకి చెందిన రాపూరి అంజయ్య (52) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. అంజయ్య కొంతకాలంగా నెమ్ము సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం అతను మద్యం తాగి ఇంటికి రాగా భార్య కోటేశ్వరమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది స్థానికంగా ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి మద్యం తాగాడు. విష గుళికలు మింగి అకస్మారక స్థితికి చేరాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. వారు 108 అంబులెన్స్లో అంజయ్యను వింజమూరు హాస్పిటల్ తరలించారు. అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కొండాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.
మద్యం మత్తులో
భార్య, అత్తపై దాడి
కావలి రూరల్: ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి చేశాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కావలి ముసునూరు శివయ్య రైస్మిల్లు సమీపంలో చలంచర్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతను అద్దె ఆటో నడుపుతుంటాడు. రోజూ మద్యం తాగి భార్య సుజాతను ఇబ్బంది పెట్టేవాడు. బుధవారం రాత్రి గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం మద్యం తాగొచ్చి భార్యతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ముందుగానే సిద్ధం చేసుకున్న కూరగాయలు కోసే కత్తితో సుజాత చేతులు, తలపై దాడి చేశాడు. ఆమె కేకలు వేయగా పక్క ఇంట్లో ఉన్న తల్లి రాధమ్మ వచ్చి అడ్డుపడింది. దీంతో వెంకటేశ్వర్లు రాధమ్మపై కూడా దాడి చేశాడు. రక్తగాయాలు కావడంతో ఇద్దరూ 108 అంబులెన్స్లో కావలి ఏరియా వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉపాధి పనులకెళ్లి..
● తీవ్ర అస్వస్థతకు గురై కూలీ మృతి
సీతారామపురం: మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ వేపలవాగు సమీపాన కొత్త చెరువులో గురువారం పూడికతీత పనులకు వెళ్లిన షేక్ దాదాపీర్ (64) అనే ఉపాధి కూలీ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. రోజూలానే దాదాపీర్ అందరితో కలిసి పనులకు వెళ్లాడు. అతను గునపంతో మట్టిని తవ్వుతూ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. సహచర కూలీలు 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా వాహనం వచ్చేలోపే చనిపోయాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.


