● టీడీపీ నాయకురాలి
పొలానికి తరలింపు
● ఎస్సైకి చెప్పినా ప్రయోజనం శూన్యం
కొండాపురం: మండలంలోని భీమవరప్పాడు పంచాయతీ ఎస్సీ కాలనీ ఆనుకుని ఉన్న బీడు భూముల్లో టీడీపీ నాయకులు గ్రావెల్ను తవ్వి అక్రమంగా పంట పొలాలకు తరలిస్తున్నారు. బుధవారం మూడు జేసీబీలతో తవ్వి సుమారు 15 ట్రాక్టర్లలో టీడీపీ నాయకురాలైన టెలికామ్ అడ్త్వెజర్ కమిటీ సభ్యురాలు అనూష పంట భూమిని చదును చేసుకునేందుకు తరలించారు. కాలనీవాసులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా గుంతలను తీశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని బెదిరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ 2004లో కాలనీని ఆనుకుని 66 మందికి పట్టాలిచ్చారన్నారు. అయితే హద్దులు చూపించకపోవడంతో సాగు చేసుకోలేకపోయామని వాపోయారు. గతంలో కూడా కొందరు వ్యక్తులు ఇక్కడి నుంచి గ్రావెల్ తరలిస్తుంటే అడ్డుకున్నామని చెప్పారు. ఈ విషయమై కొండాపురం ఎస్సై కాసుల శ్రీనివాసులుకు ఫిర్యాదు చేయగా తహసీల్దార్కు చెప్పాలని, అప్పుడే తాము చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ తరలించే సమయంలో ఎస్సై వచ్చి చూసి అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు లొంగి లంచం తీసుకెళ్లాడని ఆరోపించారు. ఈ విషయంపై ఎస్సైను వివరణ కోరగా తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తాను అక్కడికి వెళ్లలేదని, గ్రావెల్ తరలించే వారికి పర్మిషన్లు ఉన్నాయని తెలిసిందన్నారు.


