● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరురూరల్: ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లో డీఆర్వో విజయకుమార్తో కలిసి ఆయన గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 19,74,240 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 9,62,575 మంది పురుషులు, 10,11,452 మంది మహిళలు, 213 మంది ఇతరులు ఉన్నట్లు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రీమ్యాపింగ్ ప్రక్రియలో ప్రారంభంలో 66 శాతం పూర్తవగా, ప్రస్తుతం 82.62 శాతానికి చేరిందన్నారు. ప్రస్తుతం 45,890 (2.32 శాతం) కేసులు మాత్రమే మ్యాపింగ్ కాలేదన్నారు. 2,44,874 (12.40 శాతం) ట్రేస్ కాని కేసులు ఉన్నాయని తెలిపారు. మ్యాపింగ్ కాని, ట్రేస్ కాని కేసులకు మాత్రమే సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. 80,405 మంది ఓటర్లు మరణించినట్లుగా గుర్తించామన్నారు. వీరికి సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రం లేదా ఇతర ఆధారపత్రాలతో జాబితా నుంచి తొలగింపు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే 37,484 డూప్లికేట్, 67,384 గైర్హాజరు, 1,10,273 శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లను గుర్తించామన్నారు. 24న బీఎల్వోలు, బీఎల్ఏలతో మరో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మ్యాపింగ్ స్థితి, అనామక కేసులు, ఇతర ఏఎస్డీడీ అంశాలపై చర్చిస్తామన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బి.శ్రీరాం, బైరి శ్రీనివాస్, వై.రాజేష్, కె.శ్రీనివాసులు, టి.బాలసుధాకర్, వి.భువనేశ్వర ప్రసాద్, వి.సురేంద్రబాబు, ఎంవీ శేషయ్య పాల్గొన్నారు.


