● నాగేశ్వర స్వామి స్థలంపై
తెలుగు తమ్ముళ్ల కన్ను
● మొన్నటి వరకు ఆలయ
ప్రాంగణంలో ఇసుక దోపిడీ
● నేడు ప్రాంగణాన్ని చదును చేసి
ఆక్రమణ
● ఆక్రమణదారులకు మంత్రి
ఆనం అండదండలు
చేజర్ల: ఇసుకలో నుంచి బయటపడిన పురాతన నాగేశ్వరాలయం ఆలయ పరిసర ప్రాంతం కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకుంది. మొన్నటి వరకు ఆలయం చుట్టూ వేలాది టన్నుల ఇసుకను యథేచ్ఛగా పట్టపగలు దోపిడీ చేసిన తమ్ముళ్లు నేడు ఆ ప్రాంగణాన్ని ఆధీనంలోనికి తీసుకుని ఏకంగా యంత్రాలతో చదును చేశారు. ఇదంతా సాక్షాత్తు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగింది. కబ్జాదారులకు మంత్రి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విమర్శలున్నాయి.
అంతా వారే..
కొంతకాలం క్రితం చేజర్ల మండలంలోని పెరుమాళ్లపాడు గ్రామంలో పెన్నా నది ఒడ్డున పురాతన నాగేశ్వరాలయం ఇసుక గర్భం నుంచి బయటపడింది. ఆలయాన్ని పూర్తిస్థాయిలో వెలికితీసే క్రమంలో మంత్రి ఆనం ప్రధాన అనుచరులు ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇసుకను తొలగిస్తుండటంతో ఇక్కడ నూతన ఆలయాన్ని నిర్మిస్తారని భక్తులంతా భావించారు. కానీ స్థానికుల కోరిక మేరకు ఊరికి దూరంగా ఉన్న ఆలయాన్ని గ్రామ సమీపంలో ఆత్మకూరు – చేజర్ల ప్రధాన రహదారి పక్కనే నిర్మించేందుకు ఇటీవల మంత్రి ఆనం భూమి పూజ చేసి శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇక తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. వెంటనే పురాతన ఆలయ ప్రాంగణంలో ఉన్న రెండు ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేశారు. యంత్రాలతో చదును చేసి సాగు చేసేందుకు గట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆలయ భూములు కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు, భక్తులు సదరు దేవదాయ శాఖ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు మాకు సంబంధం లేదు అని ఒకరిపై ఒకరు చెప్పుకొంటున్నారని భక్తులు వాపోతున్నారు.
కాపాడాలంటూ..
మంత్రి ప్రధాన అనుచరులు ఆలయానికి చెందిన భూమినైనా కాపాడాలని భక్తులు అధికారులను వేడుకుంటున్నారు. పట్టపగలు యథేచ్ఛగా ఇసుకను దోపిడీ చేసి ఆ ప్రాంగణాన్ని సైతం ఆక్రమించిన ప్రైవేట్ వ్యక్తులపై దేవదాయ శాఖ చర్యలు తీసుకోకపోవడంతో కబ్జారాయుళ్లకు, ఇసుక దోపిడీదారులకు మంత్రి ఆనం అండ ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.


