నెల్లూరు(వేదాయపాళెం): ఏపీపీఎస్సీ గ్రూప్ – 2 ప్రిలిమినరీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధించిన ఉచిత శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 25 వరకు పొడిగించారని డీబీసీడబ్ల్యూఓ, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకటలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టయిపండ్, స్టడీ మెటీరియల్ను అందజేయనున్నామని పేర్కొన్నారు. డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని వివరించారు. వీరికి తరగతులను ఈ నెల 30న ప్రారంభించనున్నామని చెప్పారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను శోధన్నగర్లోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. వివరాలకు 93815 54779, 93902 39588 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి
24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 90,045 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 38,573 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టిక్కెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


