నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ను నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికల్లో పార్టీ కార్యకర్తలు పోస్ట్ చేసే కంటెంట్ను తొలగించడం, అడ్డంకులు సృష్టించడం వంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు యాప్ను రూపొందించారని తెలిపారు. దీని ద్వారా ప్రతి కార్యకర్తా తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయడంతో పాటు పార్టీతో నేరుగా అనుసంధానమై ఉండే అవకాశం కలుగుతుందని చెప్పారు. గ్రామ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు అందరూ ఒకే వేదికపై అనుసంధానమవుతారని.. క్షేత్రస్థాయిలో ప్రజలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసుల వేధింపులు వంటి అంశాలను నేరుగా పార్టీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యాప్ ద్వారా ఉంటుందని వివరించారు. పార్టీ నిర్వహించే సమావేశాలు, ప్రెస్మీట్లు, ముఖ్య ప్రకటనలు, కార్యక్రమాలన్నీ లైవ్ ఫీడ్ రూపంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. యాప్ను భవిష్యత్తులో మరింత విస్తరించి, కార్యకర్తల సమస్యలపై వెంటనే స్పందించేలా అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. రాజకీయ వేధింపులు, పోలీసుల ఇబ్బందులను నమోదు చేసేందుకు పార్టీ రూపొందించిన డిజిటల్ డైరీని సైతం ఈ యాప్తో అనుసంధానించనున్నారని వెల్లడించారు. దీంతో బాధితులు నేరుగా ఫిర్యాదులు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పార్టీ మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద, ఇంద్రసేన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


