ఇందుకూరుపేట: భక్తుల కొంగు బంగారమైన గంగపట్నంలోని చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 21 నుంచి జూలై 2వ తేదీ వరకు అమ్మవారు ప్రతిరోజు వివిధ వాహనాలపై పలురూపాల్లో దర్శనమివ్వనున్నారు. ఆదివారంతో అంకురార్పణ, ధ్వజారోహణ, 22న చప్పరోత్సవం, 23న గజ వాహనం, 24, 28న సింహవాహనం, 25, 27న పులి వాహనం, 26 అశ్వ వాహన ఉత్సవాలు జరుగనున్నాయి. అలాగే ముఖ్యమైన కల్యాణోత్సవం 29వ తేదీ, 30న వసంతోత్సవం, గంగోత్సవం జరుగుతాయి. ఉత్సవాల్లో ప్రధానమైన సిరిమాను(రథోత్సవం) జూలై 1న, తెప్పోత్సవం 2వ తేదీ ఉంటాయి. ఉత్సవాలకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి, కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.


