● బాధితులకు అప్పగింత
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో చోరీకి గురైన, ప్రజలు పోగొట్టుకున్న రూ.1.14 కోట్ల విలువైన 570 మొబైల్ ఫోన్లను సైబర్ క్రైమ్, స్థానిక పోలీస్లు సంయుక్తంగా రికవరీ చేశారు. వాటిని శుక్రవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అజిత వేజెండ్ల బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైందన్నారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ సేవలు, విద్య, ఉద్యోగాలు, వ్యాపార కార్యకలాపాలు తదితరాలు దాని ద్వారానే జరుగుతున్నాయన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న ఫోన్ చోరీకి గురైనా?, పోగొట్టుకున్నా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వెంటనే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటి రిజిస్టర్)పోర్టల్లో లేదా స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. సాంకేతికత ఆధారంగా ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది విడతల్లో రూ.10 కోట్ల విలువైన 5,010 ఫోన్లను రికవరీ చేశామన్నారు. ప్రజలు సీఈఐఆర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ చూపిన సైబర్ విభాగం ఇన్స్పెక్టర్ ఎం.పూర్ణచంద్రరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎన్.రామారావు, సైబర్ సోషల్ మీడియా, జిల్లాలోని పోలీసు అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు దశరథరామారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


