నెల్లూరు (లీగల్): చట్టపరమైన సాయంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పారా లీగల్ వలంటీర్ల (న్యాయసేవా సహాయకులు) పాత్ర కీలకమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా భవన్లో పారా లీగల్ వలంటీర్లతో సమావేశాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఆదేశానుసారం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సామాన్యులు.. న్యాయవ్యవస్థకు వారధిగా వ్యవహరిస్తూ బాధ్యతతో మెలగాలని సూచించారు. న్యాయం కోసమొచ్చే పేద మహిళలు, అణగారిన, బలహీన వ ర్గాలకు చెందిన ప్రజలకు న్యాయ, చట్టపరమైన అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చి న్యాయసేవాధికార సంస్థ లను ఆశ్రయించేలా కృషి చేయాలని కోరారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్, లోక్ అదాలత్ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గోపాల్రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


