కల్లు గీస్తుండగా.. | - | Sakshi
Sakshi News home page

కల్లు గీస్తుండగా..

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

విషపురుగు కాటుతో కార్మికుడి మృతి

సంగం: మండలంలోని దువ్వూరు గ్రా మంలో విషపురుగు కాటుతో కల్లుగీత కా ర్మికుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (47) కల్లు గీసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా అతడిని విషపురుగు కాటేసింది. అయితే చీమ కుట్టిందేమోనని భావించిన వెంకటరమణయ్య పట్టించుకోకుండా ఇంటికి చేరుకుని భోజనం చేసి నిద్రించాడు. ఆదివారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బుచ్చిరెడ్డిపాళెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్‌ వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు.

వ్యక్తి ఆత్మహత్య

నెల్లూరు(క్రైమ్‌): గూడ్స్‌ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్‌ బోర్డు సమీపంలో మూడో రైల్వేలైన్‌లో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. 5.2 అడుగుల ఎత్తు కలిగి బ్రౌన్‌ రంగుపై తెలుపు గీతల చొక్కా, బులుగు గీతల లుంగీ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్‌.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు.

చికెన్‌ వ్యర్థాలు

తరలిస్తుండగా..

మినీ లారీ స్వాధీనం

మనుబోలు: చికెన్‌ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న మినీ లారీని మండల పరిధిలోని జాతీయ రహదారిపై చవటపాళెం క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు గస్తీ నిర్వహిస్తూ చైన్నె నుంచి గుమ్మలదిబ్బకు వెళ్తున్న మినీ లారీని ఆపి పరిశీలించారు. అందులో చికెన్‌ వ్యర్థాలు ఉండటంతో స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement