● కమిషనర్కు ఆనం విజయకుమార్రెడ్డి లేఖ
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ డివిజన్ల పునర్విభజనకు సంబంధించి సరిహద్దులపై అభ్యంతరాలున్నాయని, ప్రజల్లో గందరోగోళం నెలకొందని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అభ్యంతరాలు తెలుపుతూ కమిషనర్ వై.నందన్కు ఆదివారం లేఖ ఇచ్చారు. కొత్త డివిజన్ల మ్యాప్లో సరిహద్దులను సాధారణ ప్రాంతాల పేర్లతో కాకుండా సర్వే నంబర్లు ద్వారా చూపించారన్నారు. ప్రజలు తమ ప్రాంతం ఏ డివిజన్లో ఉందో అర్థం చేసుకోలేకపోతున్నారని తెలిపారు. 72 డివిజన్ల సరిహద్దులను గుర్తించడం కష్టంగా మారిందన్నారు. డివిజన్లలో చేర్చిన ప్రాంతాల వివరాలు కూడా స్పష్టంగా లేకపోవడంతో ఏ ఏరియా ఏ డివిజన్లో ఉందో ప్రజలకు అయోమయం కలుగుతోందన్నారు. వార్డులను సరైన కారణం లేకుండా విభజించారని ఆరోపించారు. ఒక ప్రాంతాన్ని ఒక డివిజన్ నుంచి తీసి మరో డివిజన్లో చేర్చారన్నారు. రాజకీయం లేదా పాలనాపరమైన అసమానతలు ఉన్నాయనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సరైన కారణాలతో, ప్రజలకు అర్థమయ్యే విధంగా మార్పులు చేయాలని సూచించారు. ప్రాంతాల విభజన పారదర్శకంగా జరగాలన్నారు.


