చిల్లకూరు: నిల్వ ఆహార పదార్థాలు, కుళ్లిన మాంసం వినియోగంపై పలుమార్లు పట్టుకుని హెచ్చరించినా మార్పు రాదా అని ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతల అధికారులు మండిపడ్డారు. గూడూరు బైపాస్ కూడలిలో ఓ హోటల్, దాబాలలో వారు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. వంటగదిలో బొద్దింకలు, ఈగలు, ఎలుకలు తిరుగుతుండడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా కనీస జాగ్రత్తలు పాటించరా అని ప్రశ్నించారు. అనంతరం తయారు చేసేందుకు సిద్ధం చేసిన ఆహార పదార్థాలను డస్ట్బిన్లో వేశారు. అలాగే దాబాలో కూడా నిల్వ ఉన్న ఆహార పదార్థాలను బయట పారవేశారు. డొమస్టిక్ గ్యాస్ సిలిండర్లను వాడుతుండడంతో వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే తూనికల మెషీన్లలో కూడా తేడాలు రావాడంతో వాటిని సీజ్ చేస్తున్నామన్నారు. తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ రమాదేవి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జి.వెంకటేశ్వరరావు, సివిల్ సప్లయ్స్ అధికారి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


