● నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి
వాకాడు: ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చాపకింద నీరులా కుట్ర చేస్తుందని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం వాకాడులోని తన నివాసంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నేతలు, కార్యకర్తలు, స్థానికులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను పలు గ్రామాల ప్రజలు రామ్కుమార్రెడ్డికి విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సుల ముసుగులో చంద్రబాబు తన కుతంత్నాన్ని మరింత వేగం పెంచారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఈ విషయమై పలు సంఘాలు, ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారన్నారు. కోట, చిట్టమూరు, వాకాడు మండలాల ప్రజలు రామ్కుమార్రెడ్డిని కలిసి వాకాడు డిపోను తొలగిస్తే జరిగే నష్టాలను వివరించారు. డిపోను ఎత్తేస్తే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేయడానికి వెనుకాడబోమని రామ్కుమార్రెడ్డి హెచ్చరించారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు దిమ్మతిరిగే సమాధానం చెబుతారన్నారు. వాకాడు గొల్లపాళెం గ్రామానికి చెందిన పాపారెడ్డి మనోజ్కుమార్రెడ్డి రామ్కుమార్రెడ్డిని కలిసి తమ గ్రామంలో 19వ తేదీన జరిగే మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలకు ఆహ్వానించారు.


