● ప్రోటోకాల్ ఉల్లంఘించిన అధికారులు
● శిలాఫలకాల్లో కానరాని
ఎంపీ గురుమూర్తి పేరు
చిల్లకూరు: గూడూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే సునీల్ ప్రారంభించిన కూరగాయల మార్కెట్, పీహెచ్సీ భవనం శిలాఫలకాల్లో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి పేరును నమోదు చేయకుండా ప్రోటోకాల్ను ఉల్లంఘించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఎన్హెచ్ఎం నిధులతో పాటు మున్సిపాలిటీ నిధులతో ఆస్పత్రి భవనం నిర్మించడం గమనార్హం. ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ పేర్లు నమోదు చేయాల్సిన అధికారుల అత్యుత్సాహమో, బాధ్యతా రాహిత్యమో తెలియదు కానీ గూడూరు నియోజకవర్గానికి ఏ మాత్రం సంబంధం లేని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి పేరును మాత్రం శిలాఫలకంలో వేయించి, తిరుపతి ఎంపీ గురుమూర్తి పేరును వేయకుండా ఘోరంగా అవమానించారంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయితే ఆయా కార్యక్రమాలకు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్తోపాటు, తిరుపతి ఎంపీ గురుమూర్తికి ఆహ్వాన పత్రికలు కూడా పంపకపోవడం దళిత ఎమ్మెల్యేగా ఉండి దళిత ప్రజాప్రతినిధులను అవమానించడం దారుణమన్నారు. గూడూరు మున్సిపల్ ప్రత్యేకాధికారిగా వ్యవహరించే గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ కూడా శిలాఫలకాల ప్రోటోకాల్పై ప్రశ్నించకపోవడం విమర్శలకు తావిస్తుంది.
రేపు సీఎం జిల్లా పర్యటన
నెల్లూరురూరల్: సీఎం చంద్రబాబు ఈ నెల 19న జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10 గంటలకు కావలి మండలం తుమ్మలపెంటకు చేరుకుంటారన్నారు. ఇక్కడ మత్స్యకారుల సేవలో కార్యక్ర మం అనంతరం 12.45 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.15 గంటలకు హెలికాప్టర్లో చిత్తూరు జిల్లాకు వెళ్తారని కలెక్టర్ వివరించారు.


