వెంకటాచలం: మండలంలోని తిక్కవరప్పాడు నుంచి గొలగమూడికి యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారు. మైనింగ్ శాఖ అనుమతులు ఉంటేనే గ్రావెల్ తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఏఎంఆర్ సంస్థకు రాయల్టీ చెల్లించామని నిర్వాహకులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నారు. భూగర్భ గనుల శాఖ అధికారుల అనుమతి ఉంటేనే ఏఎంఆర్ సంస్థ రాయల్టీ వసూళ్లు చేసుకోవచ్చుననే నిబంధనలున్నా వాటిని బేఖాతరు చేస్తూ ఆ సంస్థ పేరుతో కొందరు సిబ్బంది గ్రావెల్ రవాణా చేస్తున్న నిర్వాహకుల వద్ద రాయల్టీ వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా గనులశాఖ, రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


