● సుమారు రూ.15 లక్షలు నష్టం
● పోలీసులకు ఫిర్యాదు
ఆత్మకూరు: అల్లనేరేడు చెట్లు దగ్ధమైన ఘటన ఆత్మకూరు మండలం కరటంపాడులో చోటు చేసుకుంది. బాధితుడు మలినేని సురేష్ ఆత్మకూరు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశాడు. అందులోని వివరాల మేరకు.. కరటంపాడుకు చెందిన సురేష్ హైదరాబాద్లో ఉంటున్నాడు. అతనికి స్వగ్రామంలో 9 ఎకరాల భూమి ఉంది. ఇందులో, మరో మూడున్నర ఎకరాలు లీజుకు తీసుకుని 2021 నుంచి జామ, మామిడి, అల్లనేరేడు సాగు చేపట్టాడు. డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.11 లక్షలు ఖర్చు చేశాడు. సురేష్ తన తోటకు సమీపంలో ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన ఎకరా పొలాన్ని లీజుకు తీసుకుని ఖాళీగా పెట్టాడు. అక్కడ గడ్డి మొలవడంతో దానిని మూడురోజుల క్రితం ప్రసాద్ తగులబెట్టాడు. దీంతో మంటలు వ్యాపించగా 160 అల్లనేరేడు చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. డ్రిప్ పైపులు మొత్తం కాలిపోయాయి. సుమారు రూ.15 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని సురేష్ చెబుతున్నాడు. దీని కారకుడైన వ్యక్తిని విచారించి కఠినంగా శిక్షించాలని పోలీసులకు విన్నవించాడు.


