రేపు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు
● పోలింగ్కు సర్వం సిద్ధం
నెల్లూరు(లీగల్): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహిస్తున్న ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు బార్ అసోసియేషన్ హాల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్టు నెల్లూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పులిమి అయ్యపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 40,000 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 143 మంది న్యాయవాదులు పోటీ పడుతున్నారన్నారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుందన్నారు. ప్రతి న్యాయవాది 23 మంది అభ్యర్థులను ఎన్నుకోవచ్చన్నారు. ఓటరు కచ్చితంగా ఐదు ఓట్లు వేయాలన్నారు. క్యాపిటల్ లెటర్స్ (ONE, TWO, THREE, FOUR, FIVE) మాత్రమే రాయాలన్నారు. ఐదు కంటే తక్కువ ఓట్లు వేస్తే చెల్లదన్నారు. నెల్లూరు నుంచి ప్రస్తుత బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్రెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డి.ఫణిరత్నం, ఆలిండియా లాయర్స్ యూనియన్ బలపరిచిన సత్తు అంకయ్య, ఒ.ఈశ్వర మనోజ్కుమార్, ఒ.వెంకటరాజు బరిలో ఉన్నారు. గుర్తింపుకార్డుతో న్యాయవాదులు ఓటు వేయాలని, పోలింగ్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
రైలు కింద పడి
వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వేదాయపాళెం – వెంకటాచలం రైల్వేస్టేషన్ మధ్యలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై బుధవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. తెలుపు రంగు కట్ బనియన్, పచ్చరంగు గళ్ల టవల్ నడుముకు చుట్టుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు.
పెన్నానది నుంచి
ఇసుక తరలిస్తుండగా..
● ట్రాక్టర్ కింద పడి వృద్ధుడి మృతి
బుచ్చిరెడ్డిపాళెం: పెన్నా నదిలో ఇసుక తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం మండలంలోని జొన్నవాడ వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెనుబల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్ (64) జొన్నవాడ సమీపంలోని పెన్నా నది నుంచి ట్రాక్టర్లో ఇసుకలోడ్ చేసుకుని తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పడంతో టైరు కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్కుమార్రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పెనుబల్లి గ్రామంలో విషాదం నెలకొంది.


