జిల్లాలో బిర్లానూ సిమెంట్ బోర్డు యూనిట్ ఏర్పాటు
నెల్లూరురూరల్: ఫైబర్ సిమెంట్ బోర్డు ప్లాంట్ బిర్లానూ విస్తరణలో భాగంగా జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఫైబర్ సిమెంట్ బోర్డు యూనిట్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అక్షత్ సేథ్ శనివారం ఒక ప్రటనలో వెల్లడించారు. మొదటి దశలో సుమారు రూ.127 కోట్లు పెట్టుబడి పెడుతుందన్నారు. ఈ ప్రాంతంలో నైపుణ్యం, సెమీస్కిల్డ్ ప్రతిభకు దాదాపు 600 ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. ఈ ప్లాంట్ రాష్ట్రంలో పెరుగుతున్న డిమాండ్ను తీరుస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ నెల్లూరుతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ అనుబంధ, సహాయక పరిశ్రమల వృద్ధిని కూడా పెంచుతుందని భావిస్తునామన్నారు. రెండో దశలో పీవీసీ పైపులు, ఫిట్టింగ్లు, నిర్మాణ రసాయనాల కోసం అదనపు యూనిట్లతో ప్రారంభిస్తామని తెలిపారు.
జిల్లాకు లంక దినకర్
రాక రేపు
నెల్లూరు (దర్గామిట్ట): 20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్ ఈ నెల 24న జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు నెల్లూరు గెస్ట్హౌస్కు చేరుకుంటా రు. ఈ నెల 25న ఉదయం 10.30 గంటల నుంచి కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఆరో గ్య, విద్యా రంగాల ప్రత్యేక పథకాల అమలు, అమృత్ పథకం, జల్ జీవన్ మిషన్, ప్రధాన్ మంత్రి సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాల పురోగతిపై సమీక్షిస్తారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడి చైన్నెకు వెళ్తారన్నారు.
బాధ్యతలు స్వీకరించిన
జెడ్పీ సీఈఓ
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ సీఈఓగా ఎల్.శ్రీధర్రెడ్డి శనివారం జెడ్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్రెడ్డిని జెడ్పీ సీఈఓగా పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర అధికారులు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
నేడు సత్యసాయి
శత జయంతి వేడుకలు
నెల్లూరు (దర్గామిట్ట): భగవాన్ శ్రీ సత్య సాయిబాబా 100వ జయంతి వేడుకలను ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, సిబ్బంది, సత్యసాయి వలంటీర్లు, సేవకులు, భక్తులు తదితరులు తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయా లని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
మహిళా అభ్యర్థుల నుంచి
దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): నెల్లూరు జిల్లా వలేటిపారిపాళెంలోని ఆదర్శ పాఠశాలలో గెస్ట్ ప్యాకల్టీ, డైలీ వేజ్, పార్ట్టైంలో పనిచేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ పాఠశాలలో పార్ట్టైం టీచర్లు–1, హెడ్కుక్–1, అసిస్టెంట్కుక్–2, చౌకీదార్–1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ నెలకు రూ.10 వేలు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, చౌకీదార్కు రోజుకు రూ.250 ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తులను సమగ్రశిక్ష, నెల్లూరు కార్యాలయంలో అందజేయాలన్నారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 60,098 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.75 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


