
కావ్య అక్రమాల నిగ్గు తేల్చుతాం
నెల్లూరు (అర్బన్): కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చుతామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. కావ్య అవినీతిని ప్రశ్నించినందుకే కక్షగట్టి పోలీసుల ద్వారా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు. జలదంకి మండలం అన్నవరం క్వారీలో జరుగుతున్న అక్రమాలు, రూ.900 కోట్ల మనీస్కాం వెనుక ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధుల హస్తంపై విచారణ జరిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పలువురు పార్టీ నేతలతో కలిసి కాకాణి కలెక్టర్ ఆనంద్కు కలెక్టరేట్లో సోమవారం వినతిపత్రం అందజేశారు. కాకాణి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. కావలి ఎమ్మెల్యే అన్నవరం క్వారీలో పరిమితికి మించి చేపడుతున్న అక్రమ తవ్వకాలను వెలుగులోకి తెచ్చేందుకు 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్కుమార్రెడ్డి డ్రోన్తో ఫొటోలు తీయించారన్నారు. ఎమ్మెల్యే లేని ప్రాంతంలో ఎమ్మెల్యేని చంపడానికి డ్రోన్ ఎగురవేశారంటూ హత్యాయత్నం కేసు నమోదు చేయ డం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎక్కడ బెయిల్ వస్తుందోననే ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ కేసు కూడా పెట్టడం సిగ్గు చేటన్నారు. తాము రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని పరామర్శించడానికి వెళ్తుంటే తొడగొట్టి మీసం మెలేసిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులను పురమాయించి తమను, తమ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడం చేతగాని తనమన్నారు. కావలి ప్రాంతంలో రూ.900 కోట్ల మనీ స్కాంలో సూత్రధారులను వదిలేసి అనామకులైన ఒకరిద్దరిపై కేసులు దులుపు కోవడం దారుణమన్నారు. ఈ మనీస్కాంను కావలి ఎమ్మెల్యే ఎందుకు తొక్కిపెడుతున్నాడో సమాధానం చెప్పాలని కాకాణి డిమాండ్ చేశారు. పేదల సొమ్ముకు ఆశ పడి మనీస్కాంకు పాల్పడిన కావలి ఎమ్మెల్యే శాసనసభకు అర్హుడా అని ప్రశ్నించారు. ఎన్ని కారుకూతలు కూసినా కావ్య అవినీతిని బట్టబయలు చేసి తీరుతామన్నారు. ఎస్పీకి వినతిపత్రం ఇచ్చి నా స్పందించడం లేదన్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని కావలి ఎమ్మెల్యే నిర్వహిస్తున్న క్వారీ అక్రమాలు, మనీ స్కాం సూత్రధారులపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ స్పందించకపోతే చలో అన్నవరం కార్యక్రమం నిర్వహించి తీరుతామన్నారు.
స్థాయి మరిచి.. బజారు భాష ఏంటి?
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన స్థాయిని మరిచి బజారు మనిషిగా మాట్లాడుతున్న మాటలను చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారన్నారు. తమ పార్టీ నాయకులను కావలికి రమ్మని పిలిచి పోలీసులతో హౌస్ అరెస్టు చేయించిన పిరికోడని దుయ్యబట్టారు. పోలీసులు ఎవరి మాటలు విని తమ ఇళ్లను చట్టుముట్టారో తెలపాలన్నారు.
ఎమ్మెల్యే నిజాయితీ నిరూపించుకోవాలి
సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ప్రతి పక్షంలో ఉన్న రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రజలకు అండగా ఉన్నాడన్నారు. ప్రజలకు జరిగే ఇబ్బందులను ప్రశ్నించాడన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ప్రతాప్కుమార్రెడ్డి చేసిన విమర్శలను స్వీకరించి స్వచ్ఛందంగా ఎమ్మెల్యే నిర్వహిస్తున్న క్వారీపై అధికారులతోనే విచారణ జరిపించుకోవాలన్నారు. కావలికి ప్రతిపక్ష నాయకులు వస్తే ఒప్పుకునేది లేదంటే.. అదేమైనా జీ జగీరా అని ప్రశ్నించారు.
ప్రశ్నిస్తేనే 307 సెక్షన్ నమోదు చేస్తారా?
నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి మా ట్లాడుతూ కేవలం ప్రశ్నిస్తేనే 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారా? అని నిలదీశారు. జగన్మోన్రెడ్డి పర్యటనలో ప్రసన్నకుమార్రెడ్డి ఇంటి వద్ద మఫ్టీలో ఉన్న ఓ పోలీసు తట్టుకుని కింద పడితే ప్రసన్నకుమార్రెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టారన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రౌడీలను పెంచిపోషిస్తున్నదే అధికారపార్టీ ఎమ్మెల్యేనన్నారు.
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిపై అక్రమ కేసు దుర్మార్గం
ఎమ్మెల్యే క్వారీలో అవినీతిపై
విచారణ జరపాలి
రూ.900 కోట్ల మనీస్కాం సూత్రధారులను కాపాడుతున్న ఎమ్మెల్యే
వైఎస్సార్సీపీ నేతలతో కలిసి కలెక్టర్కు కాకాణి వినతిపత్రం