
కనికరం చూపండయ్యా..
● అధికారులకు అర్జీదారుల వినతి
నెల్లూరు(అర్బన్): సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ అర్జీలను ఇస్తున్నామని.. ఎంపీడీఓలు, తహసీల్దార్లు పట్టించుకోకపోవడంతో విసిగివేసారిపోయామని.. మీరైనా పరిష్కరించాలని పలువురు అర్జీదారులు కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. అర్జీలను జేసీ కార్తీక్, డీఆర్వో హుస్సేన్సాహెబ్, డ్వామా పీడీ గంగాభవాని, జెడ్పీ సీఈఓ మోహన్రావు, డీపీఓ శ్రీధర్రెడ్డి తదితరులు స్వీకరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో కలిపి సుమారు 400 అర్జీలు అందాయి.
సమస్యలను సకాలంలో పరిష్కరించాలి
అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రజలు అందజేసే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఒకవేళ అలా కాకపోతే అందుకు గల కారణాలను తెలియజేయాలని సూచించారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అధికారుల తప్పిదానికి సంక్షేమ పథకాలు కట్
చేపలు పట్టుకొని నేను, నా భార్య పోలమ్మ జీవిస్తున్నాం. మాకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వం గతంలో నిర్వహించిన హౌస్ హోల్డ్ సర్వేలో నా రేషన్ కార్డులో పోలమ్మ పేరును పోలయ్యగా వెబ్సైట్లో అధికారులు చూపారు. పోలయ్యకు ప్రభుత్వోద్యోగం ఉందంటూ రేషన్ కార్డులో ఐడీ నంబర్ను ఇచ్చారు. దీంతో సంక్షేమ పథకాలు రద్దు కావడంతో పాటు ఆరోగ్యశ్రీ వర్తించలేదు. అధికారుల తప్పిదానికి బలయ్యాం. సచివాలయాలు.. తహసీల్దార్ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. కలెక్టరేట్కు మూడుసార్లు వచ్చినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. – కునాసి వెంకటేశ్వర్లు, రవీంద్రాపురం, విడవలూరు మండలం
పొదుపులో దాచుకున్న డబ్బును కాజేశారు
రాష్ట్రంలోనే తొలిసారిగా పొదుపు మహిళల కోసం లేగుంటపాడులో ఏర్పాటు చేసిన బ్యాంక్లో నెలకు రూ 2500 చొప్పున అక్టోబర్, 2018 నుంచి చెల్లించా. దీని మెచ్యూర్టీ కింద గతేడాది మార్చిలో రూ 2.35 లక్షలు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని బ్యాంక్ సీఈఓ ప్రసాద్రెడ్డి చెల్లించలేదు. కలెక్టరేట్లో ఫిర్యాదు చేయగా, డీఆర్డీఏ అధికారులు, డీసీఓ కార్యాలయాధికారి నిర్మల విచారణ జరిపారు. దీంతో చెక్కును ఇవ్వగా, బ్యాంక్లో జమచేయగా బౌన్సయింది. అధికారులకు మరోసారి ఫిర్యాదు చేయగా, కోవూరు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎస్డీఎల్సీఓ సుభాషిణి విచారణ జరిపారు. నగదును మూడు రోజుల్లో ఇస్తానని మీడియా సమక్షంలో గత నెల 23న ప్రసాద్రెడ్డి చెప్పినా, నేటికీ ఇవ్వలేదు.
– ఏలూరు సుజాతమ్మ, లేగుంటపాడు, కోవూరు మండలం
విచారణలో అభిప్రాయం చెప్పడమే తప్పా..?
భర్త దూరమయ్యారు. ఇద్దరు ఆడబిడ్డలు. రూ.13 వేల వేతనంతో ఏఎస్పేట పీహెచ్సీలో ఎఫ్ఎన్వోగా పనిచేస్తున్నా. డాక్టర్లు, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు లక్ష్మికి జరిగిన వివాదంలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. లక్ష్మిపై నా అభిప్రాయాన్ని తెలిపా. అయితే అనుకూలంగా అభిప్రాయం చెప్పలేదనే ఉద్దేశంతో లక్ష్మి తీవ్ర వేధింపులకు గురిచేశారు. చదువుకోనీయకుండా కెరీర్ను దెబ్బతీశారు. ఎలాంటి తప్పు లేకపోయినా నర్సు, డాక్టర్లతో పాటు నన్ను జొన్నవాడ పీహెచ్సీకి బదిలీ చేశారు. దీన్ని రద్దు చేయాలి. – దొరసానమ్మ, ఎఫ్ఎన్వో, ఏఎస్పేట పీహెచ్సీ

కనికరం చూపండయ్యా..

కనికరం చూపండయ్యా..

కనికరం చూపండయ్యా..

కనికరం చూపండయ్యా..