
నెల్లూరు: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటిపై టీడీపీ శ్రేణులు చేసిన దాడి ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రసన్నకుమార్ ఇంటిపై నిన్న(సోమవారం, జూలై7) రాత్రి సమయంలో దాడి జరిగితే అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశామని, దానిపై ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు(మంగళవారం, జూలై8) పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.
ప్రసన్నకుమార్తో పాటు అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్రెడ్డి, ఆనం విజయ్ కుమార్రెడ్డిలు ఎస్పీకి ఆఫీస్కు వెళ్లారు. దీనిలో భాగంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘ దాడిపై నిన్ననే పిర్యాదు చేశాం. ఇప్పటి వరకూ పోలీసుల నుండి ఎలాంటి స్పందనా లేదు. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. ఇది ప్రసన్న కుమార్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం. విమర్శలలో ఏదైనా అభ్యంతరం వుంటే చట్టపరంగా వెళ్ళాలి.

ప్రసన్న కుమార్ రెడ్డి ఏమి మాట్లాడాడు...?, వేమిరెడ్డిని జాగ్రత్తగా వుండాలి అని సూచించారు. రోజా పై టిడిపీ చేసిన వ్యాఖ్యలు ఏమైయ్యాయి.. ఒక మహిళ నేత, మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను వాడు వీడు అని మాట్లాడొచ్చా?, డబ్బుంది కాబట్టి డబ్బున్నోళ్లు అన్నాం.. దాంట్లో తప్పేముంది?, దాడిలో పాల్గొన్న వారితో పాటు వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు కట్టాలి’ అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.