
ఉచితంగా ప్రవేశాలు
సంవత్సరం విద్యార్థులు 2022 – 23 48 2023 – 24 598 2024 – 25 902 2025 – 26 688
నెల్లూరు(టౌన్): ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఈ కింద 25 శాతం మంది పేద విద్యార్థులకు ఒకటో తరగతి ఉచిత ప్రవేశం కల్పించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిని గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేసిన దాఖలాల్లేవు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలతో 2022 – 23 విద్యా సంవత్సరం నుంచి ఉచిత ప్రవేశాల అవకాశం దక్కింది. పేద విద్యార్థులకు సొంత గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉచితంగా విద్యను అందించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థి గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ అయితే రూ.6,500, పట్ణణ ప్రాంతాల్లో అయితే రూ.8,500 ప్రభుత్వమే చెల్లిస్తుంది. గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియ ఇబ్బందుల్లేకుండా జరిగింది.
అడ్మిషన్లు ఇవ్వం
కూటమి ప్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు లేనట్లే అనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లుగా ఉచిత ప్రవేశాలకు ఫీజులను చెల్లించలేదు. దీంతో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గత విద్యా సంవత్సరం ఉచిత ప్రవేశాలు పొందిన పిల్లలను పాత ఫీజులు చెల్లిస్తేనే చేరండని లేకుంటే అడ్మిషన్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. పైగా బుక్స్, యూనిఫాం, అడ్మిషన్ తదితర ఫీజుల కింద రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకూ వసూలు చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత విద్యతోపాటు పుస్తకాలు, యూనిఫాం కూడా యాజమాన్యాలే ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ఉచిత ప్రవేశం పొందిన విద్యార్థుల్లో సగం మందికి పైగానే ఆయా పాఠశాలల్లో లేదా ఇతర వాటిల్లో సొంత ఫీజులు చెల్లించి చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల నుంచి విద్యాశాఖాధికారుల వరకూ అందరికీ తెలిసినా జిల్లాలో మంత్రి నారాయణకు చెందిన పాఠశాలలు ఎక్కువగా ఉండటంతో మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలున్నాయి. సాక్షాత్తు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు లేకపోవడంతో...
చింతారెడ్డిపాళెం పంచాయతీ సౌత్రాజుపాళేనికి చెందిన ఎంబీటీ వినయ్కుమార్ కుమారుడు యువ యశ్వంత్కు 2024 – 25 విద్యా సంవత్సరంలో నెల్లూరులోని రామలింగాపురంలోని నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశం లభించింది. అయితే సదరు యాజమాన్యం ఆ ఏడాది బుక్స్, యూనిఫాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతో రూ.11 వేలు తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం రెండో తరగతిలో చేరాలంటే నిబంధనలు పెట్టింది. 1వ తరగతి ఫీజు కింద రూ.13 వేలు, అలాగే రెండో తరగతికి బుక్స్, యూనిఫాంకు రూ.10 వేలు, అడ్మిషన్ ఫీజు కింద రూ.3,800 కలిపి మొత్తం రూ.26,800లు చెల్లిస్తేనే స్కూల్లో ఉంచుతామని ఖరాఖండిగా చెప్పింది. దీంతో చేసేదేమి లేక పాఠశాల ప్రారంభమైనా ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ విషయంపై యశ్వంత్ తండ్రి వినయ్కుమార్ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగుసార్లు ఫిర్యాదు చేశారు. ఇంకా మరో ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు కూడా అదే నారాయణ పాఠశాల యాజమాన్యంపై వినతిపత్రం ఇచ్చారు. అయినా నేటికీ చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించి చట్టాలను అమలు చేయాల్సిన నారాయణ వాటిని తుంగలో తొక్కి పైసా వసూళ్లే పరమావధిగా వ్యవహరించడమేమిటని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ స్కూల్స్ యాజమాన్య దారిలోనే మిగిలిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి.
విద్యాహక్కు చట్టానికి తూట్లు
పేరుకే ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో
తరగతిలో ఉచిత ప్రవేశాలు
ఫీజులు చెల్లించకుంటే పిల్లలు రావొద్దని ఆదేశాలు
సాక్షాత్తు మంత్రి నారాయణ
స్కూల్లోనే ఘటన
ఆ స్కూల్పై చర్యలు తీసుకునేందుకు అధికారుల వెనుకంజ
స్కూల్ నిర్వాకంపై గ్రీవెన్స్లో నాలుగుసార్లు ఫిర్యాదు
శిక్షకు అర్హులు
విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలే గానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఉచిత సీట్ల విషయంలో సుప్రీంకోర్టు, పార్లమెంట్ కూడా ఆదేశాలు జారీ చేశాయి. ఫీజు చెల్లించలేదని విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోకుంటే గుర్తింపు రద్దు, జైలు శిక్షకు అర్హులని చెప్పింది.
– నరహరి, రాష్ట్రాధ్యక్షుడు, ది పేరెంట్స్ అసోసియేషన్
ఇబ్బంది పెట్టడం వాస్తవమే
విద్యాహక్కు చట్టం ద్వారా ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించిన విద్యార్థుల విషయంలో ఇబ్బందులున్న మాట వాస్తవమే. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పెండింగ్ ఫీజుల చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తాం. – బాలాజీరావు, డీఈఓ

ఉచితంగా ప్రవేశాలు

ఉచితంగా ప్రవేశాలు

ఉచితంగా ప్రవేశాలు