
సచివాలయాల్లో బదిలీలలు
ఉదయగిరి: గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా సచివాలయ వ్యవస్థకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించి.. వారికి సొంత మండలాల్లోనే పోస్టింగ్లిచ్చారు. ఈ తరుణంలో గతేడాది కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను గందరగోళంగా మార్చింది. తాజాగా వీరిలో ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని బదిలీ చేసేందుకు జీఓను జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులు తమ ప్రాధాన్యాన్ని ఆన్లైన్లో ఎంపిక చేసుకున్నారు. బదిలీలు పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
విచిత్ర వైఖరి
వాస్తవానికి కౌన్సెలింగ్ను నిర్వహించి.. మెరిట్ అధారంగా బదిలీలు చేపట్టాలి. అయితే దీనికి భిన్నమైన వైఖరిని కూటమి ప్రభుత్వం అవలంబిస్తోంది. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ఆధారంగా బదిలీలు జరపనున్నారు. ఈ తరుణంలో ఇవి ఉంటేనే కోరుకున్న చోట నియమిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. ఈ పరిణామాల క్రమంలో వీటి కోసం అధికార పార్టీ నేతల ఇంటి చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి దయ లేకపోతే జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తుందోనని పలువురు కంగారు పడుతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో 769 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 8,239 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 78 మంది పంచాయతీ కార్యదర్శులకు ఇటీవల గ్రేడ్ – 4 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పించి పోస్టింగ్లను ఇచ్చారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన, ఆరోగ్య శాఖల్లో పనిచేసే కొందరికీ పదోన్నతులు లభించాయి. ప్రక్షాళన పేరిట ప్రతి సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను ఇప్పటికే కుదించారు. దీంతో అనేక మంది ఉద్యోగులు మిగిలిపోనున్నారు. వీరికి ఎక్కడ పోస్టింగ్లు ఇస్తారో అంతుచిక్కడంలేదు. మరోవైపు వార్డు సచివాలయ ఉద్యోగులకు స్థానికత (సొంత మండలం)ను తొలగించలేదు. అదే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వారికి సొంత మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వకుండా జీఓ జారీ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తప్పుబడుతున్నారు. అయినా సర్కార్ పట్టించుకోకపోవడం వీరి ఆగ్రహానికి కారణమవుతోంది.
ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట
లేఖల కోసం ఉద్యోగుల పరుగులు
అధికార అండ ఉంటే అనుకున్న చోట.. లేకపోతే మరెక్కడో
పారదర్శకతకు పాతర
బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యేలిచ్చిన సిఫార్సు లేఖలను ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాబితాను పంపారు. ఇవి లేని వారు తమను మెరిట్ ప్రాతిపదికన బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతంలో పారదర్శకతకు ప్రభుత్వం పాతరేస్తోందని ఆరోపిస్తున్నారు.

సచివాలయాల్లో బదిలీలలు