ఆగని దందా.. ఆపే దమ్ముందా | - | Sakshi
Sakshi News home page

ఆగని దందా.. ఆపే దమ్ముందా

Jun 30 2025 3:49 AM | Updated on Jun 30 2025 3:49 AM

ఆగని

ఆగని దందా.. ఆపే దమ్ముందా

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి నియోజకవర్గంలో అధికార మదంతో టీడీపీ నేతలు సహజ వనరుల దోపిడీని అవిశ్రాంతంగా సాగిస్తున్నారు. గనులను తలపించే రీతిలో గ్రావెల్‌, మట్టిని విచ్చలవిడిగా తవ్వేసి అక్రమంగా రవాణా చేస్తున్నా.. అడిగే ధైర్యం, ఆపే దమ్ము అధికార యంత్రాంగానికి లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతల రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి ఎక్కడ బలి కావాల్సి వస్తుందోనని తమ్ముళ్ల దందాలో వాటా లు తీసుకుంటూ ధ్రుతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు దారితీస్తున్నాయని భూగర్భ, వాతావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి ధన దాహానికి రహదారులు, కల్వర్టులు, వంతెనలతోపాటు చెరువు కట్టపై కలుజులు దెబ్బతింటున్నాయి. భవిష్యత్‌లో భారీ వానలు వస్తే చెరువు కట్టలు తెగి ఊర్లకు ఊర్లనే ముంచే ప్రమాదఘంటికలు పొంచి ఉన్నాయి.

గుట్టలు కరిగి.. గుంతలేర్పడి..

జిల్లాలో అత్యంత నాణ్యత కలిగిన గ్రావెల్‌ గనులు దగదర్తి మండలంలో ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఉలవపాళ్ల, కొత్తపల్లి కౌరుగుంట, అనంతవరం ప్రాంతాల్లోని గ్రావెల్‌ను మైనింగ్‌ శాఖ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా తవ్వేసి అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఈ మండలంలోని టీడీపీ నేతలు ఈ ఏడాది కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారంటే ఏ స్థాయిలో అక్రమ దందా జరుగుతుందో అర్థమవుతోంది. చెరువులు, ప్రభుత్వ భూము లు, కొండలు, తిప్పలు తేడా లేకుండా తవ్వేసి రూ.కోట్లలో గ్రావెల్‌ దందా సాగిస్తున్నారు. అటు బోగోలు, కావలి, కొడవలూరు నుంచి నెల్లూరు వరకు కొత్తగా ఏర్పాటవుతున్న లేఅవుట్లకు, రహదారులకు అవసరమైన గ్రావెల్‌కు మంచి డిమాండ్‌ ఉంది. దీంతో అధికార దమ్ము, ధైర్యంతో బహిరంగంగానే గ్రావెల్‌ తరలించి జేబులు నింపుకుంటున్నారు. రేయింబవళ్లు విచ్చలవిడిగా గ్రావెల్‌ తరలిస్తున్నా అధికారులు మాత్రం తమ్ముళ్లు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడి కిమ్మనడం లేదు.

● దగదర్తి మండలంలోని అనంతవరం, ఉలవపాళ్ల నుంచే అత్యధికంగా నెల్లూరువైపు గ్రావెల్‌ తరలివెళ్తోంది. దగదర్తిలో స్థిరపడిన అధికార పార్టీ నేత మట్టి దందాకు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇటీవల ఇఫ్కో భూముల్లో పాగా వేసి గ్రావెల్‌ తరలించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా అనంతవరం చెరువును చెరపడుతున్నారు. చెరువులో నీరు తగ్గడంతో గ్రావెల్‌ తవ్వకాలు చేస్తూ చెరువు స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పటికే దాదాపు 5 లక్షల క్యూబిక్‌ మీటర్లు మట్టిని తరలించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఉలవపాళ్లలో జాతీయ రహదారి వెంబడే ఉన్న భూములను కబ్జా చేసి గ్రావెల్‌ తవ్వకాలు చేస్తున్నారు. హైవే పక్కనే బరితెగించి దోపిడీ చేస్తున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

రహదారులు విధ్వంసమా!

అల్లూరు రోడ్డు నుంచి అనంతవరం మీదుగా నారాయణపురం వెళ్లే రోడ్డు గ్రావెల్‌ వాహనాలతో పూర్తిగా విధ్వంసమైంది. గ్రావెల్‌ మాఫియా స్వార్థానికి ప్రధాన రహదారులు చిధ్రమైపోతున్నాయి. రెండేళ్ల కిందటే వేసిన రోడ్డులు సైతం ధ్వంసమవుతున్నాయి. మరో వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్‌ రాయల్టీలు ఫీజులు చెల్లించకపోవడంతో ఆదాయానికి గండిపడుతున్నా.. అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. అనంతవరం చెరువు కలుజు కూడా దెబ్బతింది. ఆ కలుజు నుంచే తూము ద్వారా నీరు సరఫరా జరుగుతోంది. దాదాపు 150 ఎకరాలు ఆయుకట్టుకు నీరందించే ఆ తూము ధ్వంసం అవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా.. చర్యలు శూన్యం

దగదర్తి మండలంలోని అనంతవరంలో జరిగే అక్రమ గ్రావెల్‌ రవాణాతో రహదారులు చిధ్రమై పోతున్నాయిని, కల్వర్టులు, తూములు దెబ్బతిని సాగునీటి పారుదల వ్యవస్థ నిలిచిపోతుందని అనంతవరం గ్రామ రైతులు ఇటీవల కావలి ఆర్డీఓ, దగదర్తి తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వీరికి వామపక్ష పార్టీ నేతలు మద్దతు ఇచ్చారు. కానీ వారు చర్యలు చేపట్టకపోవడంతో మట్టి మాఫియా లెక్క చేయలేదు. వాహనాల రణ ధ్వనులతోపాటు రోడ్లపై దుమ్ముధూళితో స్థానికులు నరకం అనుభవిస్తున్నారు. గ్రావెల్‌ మాఫియా ధనార్జన కోసం ఇష్టానుసారంగా చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది.

అనంతవరం, ఉలవపాళ్ల,

కేకేగుంట గ్రావెల్‌ గనులు

విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు, రవాణా

మీడియా ఘోషిస్తున్నా..

చెవికెక్కించుకోని అధికార యంత్రాంగం

భారీ వాహనాల బరువుకు

దెబ్బతింటున్న రహదారులు,

వంతెనలు, చెరువు కలుజులు

ఆగని దందా.. ఆపే దమ్ముందా 1
1/1

ఆగని దందా.. ఆపే దమ్ముందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement