● కేసు నమోదు చేసిన పోలీసులు
నెల్లూరు(క్రైమ్): సోషల్ మీడియా వేదికగా క్రీడాకారిణి, ఆమె కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన జాతీయ స్థాయి క్రీడాకారిణికి గతంలో చైన్నెకి చెందిన ఎలీషా అనే వ్యక్తి సూర్యారెడ్డి పేరుతో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని నమ్మించాడు. అయితే అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమె ఆరా తీసింది. అతడి అసలు పేరు ఎలీషా అని, ఇదివరకే వివాహమై పిల్లలున్నట్లు తెలిసింది. దీంతో ఆమె అతడిని దూరంగా పెడుతూ వచ్చింది. అయితే అతను మాత్రం నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేయడం ప్రారంభించాడు. క్రీడాకారిణితో స్నేహంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలను ఆమె ఇంటి చుట్టుపక్కల అతికించడంతోపాటు ఫోన్ల్లో ఇబ్బందికరంగా మెసేజ్లు పెడుతూ వేధించసాగాడు. అంతేకాకుండా చంపేందుకు యత్నించగా గతేడాది మే నెలలో వేదాయపాళెం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. వారు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో ఉంది. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన ఎలీషా ప్రవర్తనలో మార్పులేదు. ఈనెల 2వ తేదీన క్రీడాకారిణి ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే కాకుండా ఆమె తల్లి, అక్క ఫొటోలను సేకరించి వాటిని సైతం అప్లోడ్ చేశాడు. వివిధ వ్యక్తుల ద్వారా క్రీడాకారిణి తల్లికి అసభ్యకరమైన మెసేజ్లు పంపుతున్నాడు. దీంతో బాధితురాలు ఎలీషాపై చర్యలు తీసుకోవాలని వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.