అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు అసలు టెస్టు హోదా పొందే అర్హతే లేదన్నాడు. కనీస స్థాయి లేని జట్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఎందుకు అవకాశం ఇస్తుందో తనకు అర్థం కావడం లేదన్నాడు.
ఐర్లాండ్తో పాటు టెస్టు హోదా
కాగా 2001లో ఐసీసీ అఫిలియేట్ మెంబర్గా ఉన్న అఫ్గనిస్తాన్.. 2013లో అసోసియేట్ మెంబర్ స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకుని 2017లో ఐర్లాండ్తో పాటు టెస్టు హోదా పొందింది. బెంగళూరు వేదికగా టీమిండియాతో 2018లో తమ తొలి టెస్టు ఆడి ఘోర పరాజయం చవిచూసింది.
తాజాగా ముల్లన్పూర్లో మరోసారి టీమిండియాతో టెస్టులో తలపడ్డ అఫ్గనిస్తాన్ జట్టు.. ఇన్నింగ్స్ మీద 300 పరుగుల అతి భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ అఫ్గన్ ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఎందుకు అనుమతిస్తున్నారు?
‘‘అసలు అఫ్గనిస్తాన్ను టెస్టు క్రికెట్ ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు? వాళ్లకు టెస్టు జట్టు హోదా ఎలా ఇచ్చారో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు. అఫిలియేట్ దేశాలకు కూడా వన్డే, టీ20 ప్రదర్శనలు, రికార్డుల ఆధారంగా టెస్టు హోదా ఇస్తున్నారు.
నిజానికి అఫ్గనిస్తాన్ టీ20లలో మాత్రమే మెరుగ్గా ఆడుతోంది. వన్డేల్లో కూడా వాళ్లు మరింత దృష్టి సారించాలి. ముఖ్యంగా 50 ఓవర్ల పాటు అవుట్ కాకుండా నిలబడే సత్తా ఉండాలి. అలాంటి వాళ్లు ఏకంగా టెస్టు బరిలో దిగుతున్నారు.
అఫ్గనిస్తాన్లో అవి శూన్యం
భారత్తో మ్యాచ్లో 152, 112 పరుగులు మాత్రమే స్కోరు చేయగలిగారు. గతంలో 109, 102 పరుగులకే కుప్పకూలారు. టెస్టు క్రికెట్ను ప్రమోట్ చేసేందుకు ఇలాంటి జట్లను అనుమతించడం తగునా? నిజానికి ఐదు రోజుల క్రికెట్ ఆడేందుకు పూర్తిస్థాయి వ్యవస్థ, సదుపాయాలు అవసరం. కానీ అఫ్గనిస్తాన్లో అవి శూన్యం. అఫ్గన్ ఆటగాళ్లు చెత్తగా ఆడుతున్నారని నేను అనను.
అయితే, వాళ్లకు టెస్టులు ఆడేందుకు వీలైన పరిస్థితులు లేవు. వాళ్లు ఇంతవరకు ఐదు రోజుల క్రికెట్కు అలవాటు పడనే లేదు. వ్యవస్థ సరిగ్గా లేనపుడు వాళ్లు మాత్రం ఏం చేయగలరు?’’ అని మదన్ లాల్ న్యూస్18తో పేర్కొన్నాడు. కాగా అఫ్గనిస్తాన్ ఇప్పటికి పదమూడు టెస్టులు ఆడి.. నాలుగు మాత్రమే గెలిచింది. ఎనిమిదింట ఓడి.. రెండు డ్రా చేసుకుంది.


