Virender Sehwag or Ashish Nehra to Be Next India T20 Coach: Harbhajan - Sakshi
Sakshi News home page

Team india: హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ వద్దు.. వారిద్దరే సరైనోళ్లు! సెహ్వాగ్ అయితే?

Published Sun, Feb 26 2023 3:30 PM

Virender Sehwag or Ashish Nehra to be next India T20 coach: Harbhajan - Sakshi

ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌-2022లో ఘోర పరాభావం తర్వాత భారత జట్టు హెడ్‌ కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ తప్పించాలన్న డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ20లకు హెడ్‌కోచ్‌గా భారత మాజీ పేసర్‌ ఆశిష్ నెహ్రాను నియమించాలంటూ పలువురు మాజీ క్రికెటర్‌లు సూచించారు. ఎందుకంటే గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు హెడ్‌ కోచ్‌గా వ్యవహరించిన నెహ్రా.. తమ జట్టుకు అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్‌ను అందించాడు.

తన వ్యూహాలతో జట్టును విజయ పథంలో నడిపించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది నవంబర్‌తో హెడ్ కోచ్‌గా ద్రవిడ్ రెండేళ్ల ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. వన్డే ప్రపంచకప్‌-2023 ముగిసిన అనంతరం ద్రవిడ్‌ స్థానంలో కొత్త కోచ్‌ను బీసీసీఐ నియమించే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్‌ తన అభిప్రాయాలను వెల్లడించాడు.

టీ20లకు కోచ్‌గా ద్రవిడ్‌ సెట్‌ కాడని, పొట్టి ఫార్మాట్‌ను అర్ధం చేసుకునే మైండ్‌సెట్‌ ఉన్న వారు కోచ్‌గా రావాలని భజ్జీ అభిప్రాయపడ్డాడు. టీ20ల్లో భారత్‌ హెడ్‌ కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిష్ నెహ్రాలో ఎవరినైనా నియమించాలని హర్భజన్ సూచించాడు. 

"భారత జట్టుకు ఇద్దరు కెప్టెన్‌లు ఉన్నప్పుడు, ఇద్దరు కోచ్‌లు ఉంటే తప్పు ఏమి ఉంది. ఎవరి ప్రణాళికలు వారివి. ఊదాహరణకు ఇంగ్లండ్‌ జట్టును చూస్తే మనకు అర్ధమవుతుం‍ది. బ్రెండన్ మెకల్లమ్‌ తన ఆలోచనలతో టెస్టు క్రికెట్‌ స్వరూపాన్నే మార్చేశాడు. కాబట్టి అదే దూకుడు మైండ్‌ కలిగిన వీరేంద్ర సెహ్వాగ్ లేదా  ఆశిష్ నెహ్రాను భారత టీ20 జట్టుకు హెడ్‌ కోచ్‌గా నియమించిండి. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌కోచ్‌గా ఆశిష్‌ ఏ విధంగా రాణించాడో మనం చూశం.

హార్దిక్ పాండ్యాతో కలిసి తమ జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. నా వరకు అయితే టీ20 ఫార్మాట్‌ను అర్ధం చేసుకునేవారిని కోచ్‌గా నియమిస్తే బాగుంటుంది. ద్రవిడ్‌ను టెస్టులు, వన్డేల్లో కోచ్‌గా కొనసాగించాలి. ద్రవిడ్‌ మైండ్‌ సెట్‌ వన్డే, టెస్టు ఫార్మాట్‌లకు సెట్‌ అవుతుంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్‌ పే‍ర్కొన్నాడు. 2024 టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ ఇప్పటి నుంచే మంచి జట్టుని తయారు చేయడంపై దృష్టిసారించింది. సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లిలను టీ20లకు ఎంపిక చేయకుండా.. హార్దిక్ పాండ్యా కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తోంది.
చదవండి: NZ Vs Eng: జాక్‌ లీచ్‌ మాయాజాలం.. దెబ్బకు బౌల్డ్‌.. బిత్తరపోయిన బ్యాటర్‌! వీడియో వైరల్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement