రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను సైతం వదల్లేదు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో బుమ్రాను సూర్యవంశీ ఎలా ఎదుర్కొంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ వైభవ్ మాత్రం ఎలాంటి వణుకు బెణుకు లేకుండా బుమ్రాను ఉతికారేశాడు.
రాజస్తాన్ ఇన్నింగ్స్లో బుమ్రా తను వేసిన తొలి బంతినే వైభవ్ అద్భుతమైన సిక్సర్గా మలిచాడు. ఆషాట్కు బుమ్రా సైతం ఫిదా అయిపోయాడు. బుమ్రా నవ్వుతూ తన ఎండ్ వైపు వెళ్లిపోయాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని కూడా సూర్యవంశీ స్టాండ్స్కు పంపించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బుమ్రాకే చుక్కులు చూపించావు.. బుడ్డోడా నీవు గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. కాగా వైభవ్ ఈ మ్యాచ్లో కేవలం 14 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.
ఇక గౌహతి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ను వర్షం కారణంగా కేవలం 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 150 పరుగులు చేసింది. వైభవ్తో పాటు యశస్వీ జైశ్వాల్ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.
జైశ్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లతో 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు వైభవ్ సూర్యవంశీ(14 బంతుల్లో 1 సిక్స్, 5 సిక్సర్లతో 39), రియాన్ పరాగ్(10 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్లతో 20) మెరుపులు మెరిపించారు. ముంబై బౌలర్లలో ఘజన్ఫర్ రెండు, శార్థూల్ ఠాకూర్ ఓ వికెట్ సాధించాడు.
చదవండి: ముంబై ఇండియన్స్లోకి వైభవ్ సూర్యవంశీ?


