
PC: RR X
భారత క్రికెట్ వర్గాల్లో టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill)తో పాటు అండర్-19 ఆటగాడు వైభవ్ సూర్యవంశీ పేరు మారుమ్రోగిపోతోంది. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలు బాదుతూ ఎడ్జ్బాస్టన్లో తొలిసారి జట్టును గెలిపించి గిల్ చరిత్ర సృష్టించగా.. అండర్-19 యూత్ వన్డే సిరీస్ను భారత్ గెలుచుకోవడంలో వైభవ్ది కీలక పాత్ర.
ఇంగ్లండ్ గడ్డపై యాభై ఓవర్ల ఫార్మాట్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. టీ20 మాదిరి విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. తొలి మ్యాచ్లో 19 బంతుల్లోనే 48 పరుగులు సాధించిన ఈ పద్నాలుగేళ్ల కుర్రాడు.. రెండో వన్డేలో 34 బంతుల్లో 45 రన్స్ రాబట్టాడు.
సునామీ శతకం
ఇక మూడో యూత్ వన్డేల్లో ఈ ఓపెనింగ్ బ్యాటర్ 31 బంతుల్లోనే 86 పరుగులతో దుమ్ములేపాడు. అయితే, ఆ తర్వాతి వన్డేలో మాత్రం వైభవ్ సూర్యవంశీ సునామీ ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ బౌలింగ్ను చిత్తు చేశాడు. వోర్సెస్టర్ వేదికగా కేవలం 52 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకుని.. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసు (14 ఏళ్ల వంద రోజుల వయసు)లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సాధించాడు.
అయితే, ఆఖరిదైన ఐదో వన్డేలో మాత్రం వైభవ్ 42 బంతుల్లో 33 పరుగులే చేయగలిగాడు. అయితేనేం.. ఇంగ్లండ్తో ఐదు వన్డేల్లో ఓవరాల్గా 29 సిక్సర్లు బాది.. 355 పరుగులు సాధించాడు. దీంతో క్రికెట్ ప్రేమికుల్లో ఎక్కడ చూసినా వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్ గురించే చర్చ.
వైభవ్ సూర్యవంశీ క్రేజ్ మామూలుగా లేదుగా!
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ గడ్డ మీద వైభవ్ సూర్యవంశీ మేనియా ఏ రేంజ్లో ఉందో తెలిపేలా.. అతడి ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్ ఓ పోస్ట్ షేర్ చేసింది. ‘‘ఆరు గంటల పాటు కారులో ప్రయాణించి వోర్సెస్టర్కు చేరుకున్నారు. పింక్ జెర్సీ ధరించి వచ్చి వైభవ్తో పాటు టీమ్ ఇండియాకు మద్దతు పలికారు.
ఆన్య, రివా.. వైభవ్ వయసు వారే. తమ అభిమాన ఆటగాడి కోసం వారు ఇంత దూరం వచ్చి.. మధురజ్ఞాపకాలు పోగు చేసుకున్నారు’’ అంటూ వైభవ్తో ఇద్దరమ్మాయిలు దిగిన ఫొటోలను రాజస్తాన్ రాయల్స్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.
ఐపీఎల్లోనూ సరికొత్త చరిత్ర
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ బిహార్కు చెందిన వైభవ్ను.. రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ ఫిట్నెస్లేమి కారణంగా కొన్ని మ్యాచ్లకు దూరం కాగా.. అతడి స్థానంలో తుదిజట్టులోకి వచ్చాడు వైభవ్.
రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో ఆకాశమే హద్దుగా చెలరేగి క్యాష్ రిచ్ లీగ్లో అత్యంత పిన్న వయసులోనే ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 14 ఏళ్ల 32 రోజుల వయసులో వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్తో ఐదు యూత్ వన్డేల సిరీస్ను భారత్ 3-2తో గెలుచుకుంది.
చదవండి: IND vs ENG: తుది జట్టులోకి బుమ్రా.. అతడిపైనే వేటు
Proof why we have the best fans 🫡
🚗 Drove for 6 hours to Worcester
👚 Wore their Pink
🇮🇳 Cheered for Vaibhav & Team India
Aanya and Rivaa, as old as Vaibhav himself, had a day to remember 💗 pic.twitter.com/9XnxswYalE— Rajasthan Royals (@rajasthanroyals) July 9, 2025