ఐపీఎల్ 2026లో సంచలన ప్రదర్శనలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ సొంత జట్టు వైఖరిపై అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ విషయాన్ని జట్టు అసిస్టెంట్ కోచ్ ట్రెవర్ పెన్నీ స్వయంగా వెల్లడించారు.
రాయల్స్కు ఫీల్డింగ్ కోచ్ కూడా అయిన పెన్నీ నిన్న (ఏప్రిల్ 13) సన్రైజర్స్తో మ్యాచ్ సందర్భంగా మాట్లాడుతూ.. వైభవ్కు ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. కానీ డొనోవన్ ఫెరియెరా ఫిట్నెస్ పాస్ చేశాడు. అతను గన్ ఫీల్డర్. అందుకే అతనిని మెయిన్ XIలో ఉంచాం.
వైభవ్ దీని పట్ల సంతోషంగా లేడు. ఈ విషయంలో జట్టు ఉద్దేశం వైభవ్ మంచి ఫీల్డర్ కాదని కాదు. ప్రస్తుతానికి ఫెరియెరా ఫీల్డింగ్ అత్యుత్తమంగా ఉంది. ఆ ఉద్దేశంతోనే వైభవ్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడిస్తున్నామని అన్నాడు.
కాగా, ప్రస్తుత ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ గత కొద్ది మ్యాచ్లుగా ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లోనూ అతను ఇంపార్ట్ సబ్స్టిట్యూట్గా (బ్యాటర్గా మాత్రమే) ఆడాడు. రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోవడంతో అతను డగౌట్కే పరిమితమయ్యాడు.
217 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో యశస్వి జైస్వాల్తో కలిసి ఓపెనర్గా బరిలోకి దిగి గోల్డెన్ డకౌటయ్యాడు. ఎస్ఆర్హెచ్ అరంగేట్రం పేసర్ ప్రఫుల్ హింగే అద్భుతమైన బంతితో వైభవ్ను బోల్తా కొట్టించాడు.
ఈ మ్యాచ్లో హింగే వైభవ్తో పాటు మరో ముగ్గురిని కూడా ఔట్ చేసి ఎస్ఆర్హెచ్కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. తొలి ఓవర్లోనే హింగే వైభవ్తో పాటు జురెల్, ప్రిటోరియస్లను కూడా డకౌట్ చేసి ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే ముగ్గురిని ఔట్ చేసిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు ముందు వైభవ్ అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. 5 మ్యాచ్ల్లో సగటు 40, స్ట్రైక్ రేట్ 263.16తో 200 పరుగులు చేసి, లీడింగ్ స్కోరర్గా ఉన్నాడు. సీఎస్కే, ఆర్సీబీపై 15 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసి సంచలనం సృష్టించాడు.


