అమితోత్సాహంతో సూర్య సేన : యువ ఆటగాళ్లకు పరీక్ష | Today is the first T20 between India and Bangladesh | Sakshi
Sakshi News home page

అమితోత్సాహంతో సూర్య సేన : యువ ఆటగాళ్లకు పరీక్ష

Oct 6 2024 3:51 AM | Updated on Oct 6 2024 10:17 AM

Today is the first T20 between India and Bangladesh

నేడు భారత్, బంగ్లాదేశ్‌ తొలి టి20  

రా.గం.7:00 నుంచి స్పోర్ట్స్‌18, జియో సినిమాలతో ప్రత్యక్షప్రసారం 

సొంతగడ్డపై ఐపీఎల్‌లో చెలరేగిపోయే భారత యువ క్రికెటర్లకు టీమిండియా తరఫున సత్తా చాటే మరో అరుదైన అవకాశం వచ్చింది. సీనియర్ల రిటైర్మెంట్‌తో పాటు మరికొందరు సీనియర్లు విశ్రాంతి తీసుకోవడంతో జట్టులోకి వచ్చిన పలువురు యువ ఆటగాళ్లు తమదైన చాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 

బంగ్లాదేశ్‌తో  టి20 సిరీస్‌ వారి సత్తాకు పరీక్ష పెట్టనుంది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల పోరుకు రంగం సిద్ధమైంది. అనుభవంలో మెరుగ్గా కనిపిస్తున్న బంగ్లా ఆతిథ్య జట్టుకు ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. 

గ్వాలియర్‌: బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు ఇప్పుడు కాస్త విరామం తర్వాత టి20ల్లో గెలుపుపై గురి పెట్టింది. నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్‌ తలపడేందుకు సన్నద్ధమయ్యాయి. 

జింబాబ్వే పర్యటనలో భారత్‌ను గెలిపించిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ మరో సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. టీమిండియా నుంచి కనీసం ఇద్దరు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 

మయాంక్, నితీశ్‌లకు చాన్స్‌! 
ఐపీఎల్‌లో తన మెరుపు బౌలింగ్‌తో మయాంక్‌ యాదవ్‌ అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు అదే ఎక్స్‌ప్రెస్‌ వేగం అతనికి భారత జట్టులో స్థానం అందించింది. ఆదివారం తొలి మ్యాచ్‌ ఆడే అవకాశం లభిస్తే మయాంక్‌ సత్తా చాటగలడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టైటిల్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్‌ హర్షిత్‌ రాణా కూడా చాన్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఇద్దరు పేసర్లను ఒకేసారి అరంగేట్రం చేయిస్తారా అనేది చూడాలి. 

మరో వైపు ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి కూడా బరిలోకి దిగడం ఖాయమైంది. నితీశ్‌ తన ఐపీఎల్‌ ప్రదర్శనతో జింబాబ్వేతో టూర్‌కు ఎంపికైనా...చివరి నిమిషంలో అనారోగ్యం కారణంగా తప్పుకున్నాడు. వీరితో పాటు జింబాబ్వేలో రాణించిన రియాన్‌ పరాగ్, అభిõÙక్‌ శర్మ చెలరేగిపోగలరు. 

టి20ల్లో ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న సామ్సన్, రింకూ, సుందర్, బిష్ణోయ్, వరల్డ్‌ కప్‌ విజేత జట్టులో సభ్యుడు అర్‌‡్షదీప్‌లతో భారత జట్టు పటిష్టంగా ఉంది. ఇక సారథిగానే కాకుండా అద్భుత బ్యాటర్‌గా సూర్యకుమార్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలు ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలరు. వీరిని నిలువరించడం బంగ్లాదేశ్‌కు అంత సులువు కాదు.  

అనుభవజు్ఞలతో... 
భారత్‌తో పోలిస్తే బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు ఎక్కువ అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. మహ్ముదుల్లా, ముస్తఫిజుర్, లిటన్‌ దాస్, తస్కీన్, మెహదీ హసన్‌ మిరాజ్‌... వీరంతా కనీసం 50 టి20లకు పైగా ఆడినవారే. ఇప్పుడు భారత్‌ను ఓడించాలంటే వీరంతా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. 

గతంలోనూ అప్పుడప్పుడు కాస్త మెరుపులు చూపించినా భారత్‌పై బంగ్లా పెద్దగా ఆధిపత్యం కనబర్చింది లేదు. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లలో తన్‌జీమ్, తన్‌జీద్, రిషాద్‌ ఇటీవల టి20ల్లో తమ జట్టు తరఫున కీలక ఆటగాళ్లుగా ఎదిగారు. టెస్టు సిరీస్‌ ఓడిన బంగ్లా కనీసం టి20ల్లోనైనా మెరుగ్గా ఆడి గౌరవంగా వెనుదిరగాలని భావిస్తోంది. తొలి పోరులో గెలిచి ఆధిక్యం లభిస్తే సిరీస్‌ విజయంపై బంగ్లా ఆశలు పెట్టుకోవచ్చు.  

దూబే స్థానంలో తిలక్‌ వర్మ 
వెన్ను గాయం కారణంగా ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే బంగ్లాదేశ్‌తో సిరీస్‌ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. అతను ఆదివారం ఉదయం జట్టు సభ్యులతో కలుస్తాడని బోర్డు పేర్కొంది. అయితే తొలి మ్యాచ్‌లో తిలక్‌ తుది జట్టులో ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.  

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్   ), అభిõÙక్, సంజు సామ్సన్, పరాగ్, నితీశ్‌ రెడ్డి, హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్‌ యాదవ్, అర్‌‡్షదీప్‌ సింగ్‌ 
బంగ్లాదేశ్‌: నజు్మల్‌ హసన్‌ (కెప్టెన్   ), లిటన్‌ దాస్, పర్వేజ్, తన్‌జీద్, మిరాజ్, తౌహీద్, మహ్ముదుల్లా, రిషాద్, తన్‌జీమ్, తస్కీన్, ముస్తఫిజుర్‌  

Advertisement
 
Advertisement
Advertisement