
20 నుంచి తొలి టెస్టు
లండన్: భారత క్రికెట్ జట్టు శనివారం ఉదయం ఇంగ్లండ్ చేరుకుంది. పూర్తిస్థాయి పర్యటనలో భాగంగా ముందుగా ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొంటుంది. 2025–27 కొత్త ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్–ఇంగ్లండ్ సిరీస్ భాగమవుతుంది. భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు సంప్రదాయ ఫార్మాట్కు రిటైర్మెంట్ పలకడంతో కొత్త కెప్టెన్ శుబ్మన్ గిల్ సారథ్యంలో యువ జట్టు ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటుకునేందుకు తహతహలాడుతోంది.
నిజానికి ఇదివరకే పలువురు భారత క్రికెటర్లు ఇంగ్లండ్లో ఆడుగు పెట్టారు. ఇంగ్లండ్ లయన్స్తో అనధికారిక టెస్టులు ఆడుతున్నారు. ఐపీఎల్ ఫైనల్ ముగియడంతో మిగతా ఆటగాళ్లతో కూడిన బృందం తాజాగా వచ్చింది. ‘భారత జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్కు రావడం మంచి అనుభూతినిస్తోంది’ అని సాయిసుదర్శన్ చేసిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పోస్ట్ చేసింది.
భారత్ ‘ఎ’ 348 ఆలౌట్
నార్తంప్టన్: ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 319/7తో రెండో రోజు శనివారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు 6.3 ఓవర్లే ఆడి 29 పరుగులు జోడించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ లయన్స్ ఆట నిలిచే సమయానికి 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.