
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్లో భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఐవీపీఎల్-2024లో వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్కు సారథ్యం వహిస్తున్న రైనా.. తన మెరుపు ఇన్నింగ్స్లతో జట్టుకు అద్భుత విజయాలను అందిస్తున్నాడు. ఈ లీగ్లో ఉత్తర్ప్రదేశ్ ఫైనల్కు చేరడంలో రైనా కీలక పాత్ర పోషించాడు.
ఈ లీగ్లో భాగంగా శనివారం ఛత్తీస్గఢ్ వారియర్స్తో జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో కూడా రైనా సత్తాచాటాడు. సెమీఫైనల్లో 19 పరుగుల తేడాతో ఛత్తీస్గడ్ను చిత్తు చేసిన ఉత్తర్ప్రదేశ్ తుది పోరుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వీవీఐపీ ఉత్తర్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
యూపీ బ్యాటర్లలో పవన్ నేగి మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 50 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్స్లతో 94 పరుగులు చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రైనా కూడా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. కేవలం 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 'మిస్టర్ ఐపీఎల్' 58 పరుగులు చేశాడు. ఛత్తీస్గఢ్ బౌలర్లలో షాదాబ్ జాక్తీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మునాఫ్ పటేల్, అమిత్ మిశ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఛత్తీస్గఢ్.. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. ఛత్తీస్గఢ్ ఓపెనర్లు జటిన్ సక్సేనా(76), నమాన్ ఓజా(43) అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ జట్టును మాత్రం గెలిపించలేకపోయారు.
చదవండి: AUS vs NZ: తిరుగులేని ఆసీస్.. ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం
Suresh Raina is still providing clutch performances in knockouts for his team 🐐🔥pic.twitter.com/Gu0O5ty0BB
— MN 👾 (@CaptainnRogerrs) March 2, 2024