నాన్న సంతోషించి ఉంటారు.. మెదడులో రక్తస్రావంతో! గంగూలీ సర్‌, రణదేవ్‌ సర్‌ వల్లే.. | Sure Dad Happy Seeing My Rise Emotional Mukesh Kumar on Test Call Up | Sakshi
Sakshi News home page

నాన్న సంతోషించి ఉంటారు.. మెదడులో రక్తస్రావంతో! గంగూలీ సర్‌, రణదేవ్‌ సర్‌ వల్లే..

Jun 24 2023 3:45 PM | Updated on Jun 24 2023 4:57 PM

Sure Dad Happy Seeing My Rise Emotional Mukesh Kumar on Test Call Up - Sakshi

ఎక్కడ మొదలుపెట్టాను.. ఎక్కడ ఉన్నాను! గంగూలీ సర్‌, రణదేవ్‌ సర్‌ థాంక్యూ! నాన్నా..

‘‘నా కల నెరవేరింది. టీమిండియా తరఫున టెస్టులు ఆడాలన్న ఆశయం దిశగా అడుగులు పడ్డాయి. నా ఈ ఎదుగుదల చూసి నాన్న తప్పకుండా సంతోషించి ఉంటారు. నేను ఈ స్థాయికి చేరుకున్నాననంటే అందుకు అమ్మానాన్న, నా స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. వాళ్ల మద్దతునే నేను అనుకున్నది సాధించగలిగాను’’ అని బెంగాల్‌ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

పోషకాహార లోపంతో
కాగా బిహార్‌కు చెందిన ముకేశ్‌ కుమార్‌ పేద కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో తండ్రితో పాటు 2012లో బెంగాల్‌కు చేరుకున్న ముకేశ్‌.. క్రికెట్‌ మీద ఆసక్తి పెంచుకున్నాడు.

కానీ పోషకాహార లోపం బోన్‌ ఎడిమ, మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడటం అతడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. ఈ క్రమంలో బెంగాల్‌ మాజీ స్పీడ్‌స్టర్‌ రణదేవ​ బోస్‌ పరిచయం ముకేశ్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. అతడి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి బెంగాల్‌ తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడటం మొదలుపెట్టాడు.

ఏకంగా 5.5 కోట్ల రూపాయలు
ఫస్ట్‌క్లాస్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ముకేశ్‌ కుమార్‌ కోసం ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో ఐపీఎల్‌-2023 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. దీంతో.. అంతకు ముందు 20 లక్షల కనీస ధరతో సీఎస్‌కే తరఫున ఆడిన అతడి పంట పండినట్లయింది.

ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ సందర్భంగా తొలిసారి భారత జట్టుకు ఎంపికైన ముకేశ్‌కు తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌- 2023కి స్టాండ్‌ బైగా ఎంపికైన అతడు.. వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు, వన్డే సిరీస్‌ నేపథ్యంలో తాజాగా మరోసారి సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు.

ఈ విషయంపై స్పందించిన ముకేశ్‌ హర్షం వ్యక్తం చేశాడు. స్వర్గస్తుడైన తన తండ్రిని తలచుకుని ఎమోషనల్‌ అయ్యాడు. అదే విధంగా తన గురువు రణదేవ్‌ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నాడు.

గంగూలీ సర్‌, రణదేవ్‌ సర్‌ వల్లే
‘‘సౌరవ్‌ గంగూలీ సర్‌, జాయ్‌దీప్‌ ముఖర్జీ సర్‌.. నా గురువు రణదేవ్‌ బోస్‌ సర్‌.. అందించిన సహాయసహకారాలు మరువలేనివి. వాళ్ల మద్దతే లేకుంటే నేను ఇక్కడిదాకా వచ్చే వాడినే కాదు. ముఖ్యంగా రణదేవ్‌ బోస్‌ సర్‌ రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో నాకు మార్గదర్శనం చేసి నన్ను సరైన దారిలో నడిపించారు’’ అని ముకేశ్‌ కుమార్‌ చెప్పుకొచ్చాడు.

‘‘ఎక్కడ మొదలుపెట్టాను.. ఎక్కడిదాకా వచ్చాను. నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది’’ అని ఎగ్జైట్‌ అయ్యాడు. కాగా ముకేశ్‌ కుమార్‌ తండ్రి 2019లో మరణించాడు. మెదడులో రక్తస్రావం కావడంతో శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయాడు.

విండీస్‌తో రెండు టెస్టులకు టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్‌ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్‌, నవదీప్ సైనీ. 

చదవండి: లెజండరీ ఓపెనర్‌ దిల్షాన్‌.. డీకే మాదిరే! ఉపుల్‌ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement